పల్లెకెలె: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్పై కన్నెర్ర చేశాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పసికూన నేపాల్తో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ సునాయస క్యాచ్ను అందుకోలేకపోయాడు. నేపాల్ ఓపెనర్ కుషాల్ బ్రుటేల్ ఇచ్చిన క్యాచ్ను అందుకోవడంలో కీపర్ ఇషాన్ కిషన్ తడబడ్డాడు.
గ్లోవ్స్ సాయంతో క్యాచ్ను పట్టలేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిన ఇషాన్ కిషన్ లాలిపాప్ క్యాచ్ను నేలపాలు చేశాడు. అప్పటికే రెండు క్యాచ్లు నేలపాలవ్వడం.. వికెట్ కీపర్ కూడా సునాయస క్యాచ్ వదిలేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గా.. క్యాచ్ కూడా పట్టవా? అంటూ ఇషాన్ కిషన్పై కన్నెర్ర చేశాడు.

తొలి 6 ఓవర్లలోనే మూడు క్యాచ్లు నేలపాలు చేయడంతో రోహిత్ శర్మ తలపట్టుకున్నాడు. వర్ష ప్రభావమో లేక సరైన ప్రాక్టీస్ లేకపోవడమో ఏమో కానీ చేతుల్లోకి వచ్చిన సునాయస క్యాచ్లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అది కూడా వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లు అయిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సునాయస క్యాచ్లను వదిలేయడం చూసి ఫ్యాన్స్ షాకయ్యారు.
మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ కుషాల్ భ్రుటెల్.. స్లిప్లో ఇచ్చిన సునాయస క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు. సిరాజ్ వేసిన ఆ మరుసటి బంతికే మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ ఇచ్చిన సునాయస క్యాచ్ను షార్ట్ కవర్లో ఉన్న కోహ్లీ అందుకోలేకపోయాడు. ఈ రెండు క్యాచ్లు నేలపాలు కావడంతోనే చికాకుకు గురైన రోహిత్.. ఇషాన్ మరో క్యాచ్ వదిలేయడంతో తన ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయాడు.
టీమిండియా చెత్త ఫీల్డింగ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవే తప్పిదాలు పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో చేస్తే పరిస్థితి ఏందని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. వెంటనే ఫీల్డింగ్ కోచ్ను మార్చాలని మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. నేపాల్ బ్యాటింగ్కు దిగింది. భారత ఆటగాళ్ల తప్పిదాలతో చెలరేగిన నేపాల్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్కు 65 పరుగులు జోడించిన అనంతరం కుశాల్ భ్రుటెల్(38)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన భీమ్ షక్రీ(7)ని జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 19 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 2 వికెట్లకు 90 పరుగులు చేసింది.