పల్లెకెలె: ఆసియాకప్ 2023లో టీమిండియా తొలి విజయాన్నందుకుంది. నేపాల్తో సోమవారం జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ ప్రకారం 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రోహిత్ సేన సూపర్-4కు అర్హత సాధించింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 74 నాటౌట్), శుభ్మన్ గిల్(62 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్కు కలిసొచ్చింది.

అనంతర టీమిండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో నేపాల్ ఓడినా.. అద్బుత పోరాటం కనబర్చారు. ముఖ్యంగా బ్యాటింగ్లో అసాధారణ ప్రదర్శనతో పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశారు. బౌలింగ్లోనూ ఆరంభంలో ఇబ్బంది పెట్టారు.
231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగిచింది. ఆట ఆగిపోయే సమయానికి భారత్ 2.1 ఓవర్లలో 17 పరుగులు చేసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ గంట పాటు నిలిచిపోయింది. వర్షం తగ్గడంతో మ్యాచ్ను 23 ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ ప్రకారం 145గా నిర్ణయించారు.

మ్యాచ్ పున:ప్రారంభమైన తర్వాత భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ధాటిగా ఆడారు. ఓవర్కో బౌండరీ బాదుతూ టీ20 ఫార్మాట్ తరహాలో చెలరేగారు. సందీప్ లమిచ్చనే బౌలింగ్లో సిక్సర్ బాదిన రోహిత్.. తన అసలు సిసలు ఆట చూపించాడు. గిల్ సైతం సిక్సర్తో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరి ధాటికి టీమిండియా 9 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది.
లమిచ్చనే వేసిన 11వ ఓవర్లో 4, 6 బాదిన రోహిత్.. మరుసటి ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. ఇదే జోరులో మరో బౌండరీ బాదిన రోహిత్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే శుభ్మన్ గిల్ కూడా బౌండరీ బాది 46 బంతుల్లో అర్థశతకం సాధించాడు. ఇదే జోరును చివరి వరకు కొనసాగించి మ్యాచ్ను ముగించారు.