IND vs NED: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. శ్రేయస్ అయ్యర్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 128 నాటౌట్), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 102) విధ్వంసకర శతకాలతో చెలరేగడంతో భారత్ 411 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. అయ్యర్, రాహుల్ సెంచరీలకు తోడుగా రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), శుభ్మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51), విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలు సాధించారు.

ఈ మ్యాచ్లో భారత్ టాప్-5 బ్యాటర్లు 50 ప్లస్ రన్స్ చేశారు. ప్రపంచకప్ చరిత్రలోనే ఓ టీమ్ టాప్-5 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే రెండు వికెట్లు తీయగా.. పాల్ వాన్ మెకెరెన్, వాన్ డెర్ మెర్వే తలో వికెట్ తీసారు.
అదిరిపోయే ఆరంభం..:
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ధాటిగా ఆడిన ఈ జోడీ ట్రేడ్ మార్క్ షాట్స్తో అభిమానులను అలరించింది. శుభ్మన్ గిల్ అయితే సిక్సర్ల మోత మోగించాడు. దాంతో అతను 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రోహిత్ కూడా తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్స్తో సిక్స్లు బాదడంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. ప్రమాదకరంగా ఆడుతున్న ఈ జోడీని మాన్ మెకెరెన్ విడదీసాడు. ధాటిగా ఆడుతున్న గిల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. 44 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మను బాస్ డీ లీడే పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(64 బ్యాటింగ్)తో కలిసి కోహ్లీ ఆచితూచి ఆడాడు. 53 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. వాన్డెర్ మెర్వే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

శతక్కొట్టిన అయ్యర్, రాహుల్..:
దాంతో మూడో వికెట్కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన శ్రేయస్ అయ్యర్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్న ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది.
40 బంతుల్లో రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. 84 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో టీమిండియా 46.4 ఓవర్లలోనే 350 పరుగుల మార్క్ ధాటింది.
చివర్లో శ్రేయస్ అయ్యర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా..చివరి ఓవర్లో కేఎల్ రాహుల్ వరుసగా రెండు సిక్స్లు బాది 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం భారీ షాట్ ఆడే క్రమంలోనే రాహుల్ ఔటైనా.. టీమిండియా 410 పరుగుల భారీ స్కోర్ చేసింది.