ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా 4 మ్యాచ్ల్లో గెలిచిన భారత్ అజేయంగా సూపర్-8లోకి అడుగుపెట్టింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్లో టీమిండియాకు పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ భారీ గాయాల అవ్వకుండా బయటపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శివమ్ దూబే వేసిన ఈ ఓవర్ రెండో బంతిని నెదర్లాండ్స్ బ్యాటర్ జాచ్ లయన్ ఎక్స్ట్రా కవర్ దిశగా గాల్లోకి లేపాడు. ఈ క్యాచ్ పట్టేందుకు సూర్యకుమార్ యాదవ్ వెనక్కి పరుగెత్తగా.. లాంగాఫ్ నుంచి రింకూ సింగ్ ముందుకొచ్చాడు. తానే క్యాచ్ తీసుకుంటానని సూర్య చేసిన సైగలను రింకూ సింగ్ గమనించలేదు. ఇద్దరూ బంతినే చూస్తూ పరుగెత్తారు. దాంతో ఒకరినొకరు ఢీకొని క్యాచ్ వదిలేసారు.
బంతి సూర్య చాతి భాగంలో తాకి కిందపడిపోయింది. అయితే ఇద్దరికి పెద్ద గాయాలు కాలేదు. కానీ రింకూ సింగ్పై సూర్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యాచ్ తీసుకుంటానని చెప్పానుగా.. అని మందలించాడు. రింకూ సింగ్ మాత్రం మౌనంగా నిలబడిపోయాడు.

వాస్తవానికి సూర్య సైగలకు బదులు తానే క్యాచ్ తీసుకుంటానని గట్టిగా అరిచినా, లేదా రింకూ చెప్పినా ఈ క్యాచ్ పట్టి ఉండేవారు. నిజానికి సూర్యకంటే రింకూ సింగే ఈజీగా ఈ క్యాచ్ పట్టేవాడని కామెంటేటర్స్ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఆటగాళ్లు ఇద్దరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఈ తరహాలో ఆటగాళ్లు ఒకరినొకరు ఢీకొని తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే పెను ప్రమాదం తప్పిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కీలకమైన సూపర్-8 దశ ముందు ఏ ఒక్క ఆటగాడు గాయపడినా టీమిండియా కాంబినేషన్ దెబ్బతింటుంది. ఫీల్డింగ్పై టీమిండియా మరింత ఫోకస్ పెట్టాలని మాజీ క్రికెటర్లు హితవు పలుకుతున్నారు. ఆ మరుసటి బంతికి లయన్ మరో క్యాచ్ ఇవ్వగా.. తిలక్ వర్మ వదిలేసాడు. ఆ తర్వాతి బంతికి ఇచ్చిన క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు.