IND vs NED: ఎప్పుడూ విధ్వంసకర బ్యాటింగ్తో అలరించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్తోనూ ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ.. తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ సాధించాడు. ఒకప్పుడు పార్ట్టైమ్ బౌలర్గా సత్తా చాటిన రోహిత్ శర్మ.. మోచేతిలో నొప్పి కారణంగా బౌలింగ్ వేయడం మానేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో రోహిత్ శర్మ బౌలింగ్ చేశాడు.

భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన తెలుగు తేజం తేజ నిడమనూరును ఔట్ చేసి భారత విజయా లాంఛనాన్ని పూర్తి చేశాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత తన ఖాతాలో వికెట్ వేసుకున్నాడు. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ చివరిసారిగా వికెట్ తీసాడు. వన్డేల్లో ఇప్పటి వరకు.. రోహిత్ శర్మ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్లో వికెట్ తీసిన తొలి ఇండియన్ కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. 172 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ను తెలుగు తేజం తేజ నిడమనూరు ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్న మరోవైపు భారీ సిక్సర్లతో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. చివరి వికెట్ వరకు క్రీజులో నిలిచిన తేజ.. 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను 6 సిక్స్లు కొట్టడం విశేషం. మరో ఎండ్లో అతనికి సహకారం లభించకపోవడంతో ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకునే ప్రయత్నం చేశాడు.
భారత ప్రధాన బౌలర్లందర్నీ అలవోకగా ఆడేస్తున్న తేజ నిడమనూరుకు చెక్ పెట్టేందుకు రోహిత్ శర్మనే రంగంలో దిగాడు. 48వ ఓవర్ బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ ఐదో బంతికి అతన్ని క్యాచ్ ఔట్ చేసి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేసి వికెట్ తీసాడు. అతను 9 ఏళ్ల తర్వాత వన్డే క్రికెట్లో వికెట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా తరుఫున మొత్తం 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా అందరూ బౌలింగ్ చేశారు. విరాట్ కోహ్లీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. రోహిత్ శర్మ ఐదు బాల్స్ వేసి 7 పరుగులు ఇచ్చి ఓ వికెట్ సాధించాడు.
సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ చెరో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ సాధించలేకపోయారు. మరోవైపు వన్డే ప్రపంచకప్లో ఒక మ్యాచ్లో తొమ్మిదిమంది బౌలింగ్ చేయడం ఇది మూడోసారి మాత్రమే. 1987లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ తొమ్మిది మందితో బౌలింగ్ చేయింది.
1992 ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కివీస్ తరఫున 9 మంది బౌలింగ్ చేశారు. 31 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తొమ్మిది మందితో బౌలింగ్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.