IND vs NED: టీమిండియాను వెంటాడుతున్న ఆరో బౌలింగ్ ఆప్షన్ సమస్యను అధిగమించేందుకే పార్ట్టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ కారణంతోనే ఎప్పుడూ బౌలింగ్ చేయని తనతో పాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ బౌలింగ్ చేశారని చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఓటమెరగని జట్టుగా లీగ్ దశను ముగించి సెమీస్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ పార్ట్టైమ్ బౌలర్లుగా బౌలింగ్ చేశారు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ 13 పరుగులిచ్చి ఓ వికెట్ కూడా తీసాడు. 9 ఏళ్ల తర్వాత వన్డేల్లో వికెట్ సాధించాడు.

ఐదు బంతులు మాత్రమే వేసిన రోహిత్ శర్మ 7 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అది కూడా విన్నింగ్ వికెట్ కావడం విశేషం. 11 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్ తీసాడు. శుభ్మన్ గిల్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులివ్వగా.. సూర్యకుమార్ యాదవ్ 2 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చాడు.
ఇక టీమిండియాలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ చేశారు. మొత్తం 9 మంది బౌలింగ్ చేసి సరికొత్త రికార్డ్ అందుకున్నారు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఇలా 9 మంది బౌలింగ్ చేయడం ఇదే మూడోసారి మాత్రమే. ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేసిన భారత్.. చాలా జాలీగా ఆడింది. దాంతో ఇది అంతర్జాతీయ మ్యాచ్? లేక ప్రాక్టీస్ మ్యాచ్? అనే సందేహం కలిగింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా 9 బౌలింగ్ ఆప్షన్స్ ఉపయోగించడానికి గల కారణాన్ని రోహిత్ వెల్లడించాడు. ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్న తమకు ఈ మ్యాచే సరైన వేదికగా అనిపించిందని రోహిత్ స్పష్టం చేశాడు. 'ఆరో బౌలింగ్ ఆప్షన్ ఎప్పుడూ మా మదిలో మెదులుతూనే ఉంది. జట్టులోనే ఆ ఆప్షన్ క్రియేట్ చేయాలనుకున్నాం. మాకు ఈ రోజు 9 బౌలింగ్ ఆప్షన్స్ లభించాయి. మా బౌలింగ్ ప్రయోగాలకు ఈ మ్యాచే సరైన వేదికని భావించాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో జట్టుకు దూరమవడంతో టీమిండియాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. బుధవారం ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.