IND vs NED, World Cup 2023: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ ఎడిషన్లో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి భారత కెప్టెన్గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో... హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వరుసగా రెండు ప్రపంచకప్ల్లో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి ప్లేయర్గా రోహిత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇక రెండు ఎడిషన్స్లో 500 ప్లస్ రన్స్ చేసిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ సమం చేశాడు. సచిన్ 1996, 2003 ప్రపంచకప్లో 500 రన్స్ చేయగా.. రోహిత్ శర్మ 2019, 2023 ప్రపంచకప్ల్లో వరుసగా 500 ప్లస్ రన్స్ నమోదు చేశాడు.

తాజా టోర్నీలో ఆస్ట్రేలియా, శ్రీలంకతో మ్యాచ్లో విఫలమైన రోహిత్.. మిగతా 7 మ్యాచ్ల్లో సత్తా చాటాడు. నెదర్లాండ్స్తో జరుగుతున్న తాజా మ్యాచ్లోనే అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 14,000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.
వన్డే క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్ అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గా నిలిచాడు. సింగిల్ ఎడిషన్ ప్రపంచకప్లో అత్యధిక సిక్స్లు బాది ఏబీ డివిలియర్స్ రికార్డ్ను బద్దలు కొట్టాడు. ఓ ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక ఫోర్లు బాదిన కెప్టెన్గానూ రోహిత్ చరిత్రకెక్కాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), శుభ్మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో అదిరిపోయే శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 100 పరుగులు జోడించిన అనంతరం శుభ్మన్ గిల్ క్యాచ్ ఔటవ్వగా.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మ బాస్ డీ లీడే పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ,శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నారు.