IND vs NED: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 9 మ్యాచ్లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించింది. ఆదివారం నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన రోహిత్ సేన 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన టీమిండియా.. తర్వాత బౌలింగ్లో సత్తా చాటింది. అసాధారణ విజయంతో సెమీస్కు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది.

శ్రేయస్ అయ్యర్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 128 నాటౌట్), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 102) విధ్వంసకర శతకాలతో చెలరేగగా.. రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), శుభ్మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51), విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే రెండు వికెట్లు తీయగా.. పాల్ వాన్ మెకెరెన్, వాన్ డెర్ మెర్వే తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం తేజ నిడమనూరు(39 బంతుల్లో ఫోర్, 6 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీ రాణించగా.. సైబ్రాండ్(80 బంతుల్లో 4 ఫోర్లతో 45), కోలిన్ అకెర్మన్(32 బంతుల్లో 6 ఫోర్లతో 35) పర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చెరొక వికెట్ దక్కింది. విధ్వంసకర శతకంతో టీమిండియాకు భారీ స్కోర్ అందించిన శ్రేయస్ అయ్యర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
విసిగించిన తెలుగోడు: 172 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ను తెలుగు తేజం తేజ నిడమనూరు ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్న మరోవైపు భారీ సిక్సర్లతో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు.
చివరి వికెట్ వరకు క్రీజులో నిలిచిన తేజ.. 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను 6 సిక్స్లు కొట్టడం విశేషం. మరో ఎండ్లో అతనికి సహకారం లభించకపోవడంతో ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకునే ప్రయత్నం చేశాడు.
వికెట్ తీసిన రోహిత్: భారత ప్రధాన బౌలర్లందర్నీ అలవోకగా ఆడేస్తున్న తేజ నిడమనూరుకు చెక్ పెట్టేందుకు రోహిత్ శర్మనే రంగంలో దిగాడు. 48వ ఓవర్ బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ ఐదో బంతికి అతన్ని క్యాచ్ ఔట్ చేసి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన తేజ నిడమనూరు.. ఐర్లాండ్లో స్థిరపడి ఆ దేశం తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అంచనాలను అందుకోలేకపోయిన తేజ.. చివరి మ్యాచ్లో మాత్రం హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
ఓటమెరుగని జట్టుగా నిలిచిన భారత్.. బుధవారం ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే లీగ్ దశలో కివీస్ను చిత్తు చేసిన టీమిండియా.. సెమీస్లోనూ ఓడించి గత ప్రపంచకప్ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటోంది.