IND vs NED, World Cup 2023: టీమిండియా టాప్-4 బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా టాప్-4 బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఓ ప్రపంచకప్ మ్యాచ్లో టాప్-4 బ్యాటర్లు హాఫ్ సెంచరీ బాదడం ఇదే తొలిసారి.
ఈ అరుదైన ఫీట్ సాధించిన టాప్-4 బ్యాటర్లుగా రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్ చరిత్రకెక్కారు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఏ దేశ టాప్-4 ఆటగాళ్లు కూడా ఈ అరుదైన ఘనతను అందుకోలేదు.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), శుభ్మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 100 పరుగులు జోడించిన అనంతరం శుభ్మన్ గిల్ క్యాచ్ ఔటవ్వగా.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మను బాస్ డీ లీడే పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 51),శ్రేయస్ అయ్యర్(64 బ్యాటింగ్)తో కలిసి మూడో వికెట్కు 71 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీ అనంతరం కోహ్లీని వాన్డెర్ మెర్వే క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన శ్రేయస్ అయ్యర్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. 39 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్లకు 274 పరుగులు చేసింది.
వరుసగా 8 విజయాలతో ఇప్పటికే సెమీస్ చేరిన టీమిండియా.. కీలక నాకౌట్ పోరుకు ముందు జరుగుతున్న ఈ మ్యాచ్ను ప్రాక్టీస్గా వాడుకుంటోంది. నవంబర్ 15(బుధవారం)న ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.