వన్డే క్రికెట్లో భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. సొంతగడ్డపై ఐర్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో స్మృతి మంధాన సారథ్యంలోని భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం రాజ్కోట్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించింది. ఈ గెలపుతో మూడు వన్డేల సిరీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 83), తేజల్ హసబ్నిస్(46 బంతుల్లో 9 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ గబీ లూయిస్(129 బంతుల్లో 15 ఫోర్లతో 92) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. లీహ్ పాల్(73 బంతుల్లో 7 ఫోర్లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా(2/56) రెండు వికెట్లు తీయగా.. టిటస్ సధు, సయలి, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత మహిళల జట్టు 34.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన(29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 41) శుభారంభం అందించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లెనే కెల్లీ ఓ వికెట్ తీయగా.. మాగ్యూరీ మూడు వికెట్లు పడగొట్టింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం సొంతగడ్డపై న్యూజిలాండ్, వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లను గెలుచుకుని జోరు మీదున్న భారత మహిళల జట్టు.. హ్యాట్రిక్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి భారత్లో జరగాల్సి ఉన్న మహిళల వన్డే వరల్డ్కప్ ముందు ఈ సిరీస్లను టీమిండియా సన్నాహకంగా వాడుకోనుంది. ఈ సిరీస్ నుంచి రెగ్యులర్ సారథి హర్మన్ప్రీత్ కౌర్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దాంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన జట్టును నడిపిస్తోంది.