డబ్లిన్: టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 38) తన ఐపీఎల్ జోరును కొనసాగించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన తొలి ఇన్నింగ్స్లో తనకే సాధ్యమైన బ్యాటింగ్తో చెలరేగాడు. దాంతో ఐర్లాండ్తో రెండో టీ20లో టీమిండియా 186 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(43 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 58), సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40), శివమ్ దూబే(16 బంతుల్లో 2 సిక్స్లతో 22 నాటౌట్) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెక్కార్తీ రెండు వికెట్లు తీయగా.. మార్క్ అడైర్, క్రైగ్ యంగ్, బెంజమన్ వైట్ తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓ సిక్సర్, రెండు బౌండరీలతో ధాటిగా ఆడిన యశస్వి జైస్వాల్(18)ను క్రైగ్ యంగ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే తిలక్ వర్మ(1) క్యాచ్ ఔటవ్వగా.. సంజూ శాంసన్తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 47 పరుగులే చేసింది.
అనంతరం ఈ ఇద్దరూ వేగంగా పరుగులు చేశారు. రుతురాజ్ కాస్త నెమ్మదిగా ఆడినా.. సంజూ తనదైన శైలిలో చెలరేగాడు. జోషువా లిటిల్ వేసిన 11వ ఓవర్లో సంజూ వరుసగా 4, 4, 4, 0, 6 బాది 18 పరుగులు పిండుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని బెంజమిన్ వైట్ విడదీసాడు.
హాఫ్ సెంచరీకి చేరువైన సంజూ శాంసన్(40)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ సాయంతో రుతురాజ్ గైక్వాడ్ బౌండరీ బాది 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ సిక్స్ బాదిన రుతురాజ్ గైక్వాడ్ అదే జోరులో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
క్రీజులోకి శివమ్ దూబే రాగా.. ఐర్లాండ్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. మెక్కార్తీ వేసిన 19వ ఓవర్లో రింకూ సింగ్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రింకూ సింగ్ వరుసగా 6, 4 బాదడంతో ఒత్తిడికి గురైన మెక్కార్తీ వరుసగా రెండు వైడ్లు వేసాడు.

అనంతరం రింకూ సింగ్ మరో సిక్సర్ బాది శివమ్ దూబేకు స్ట్రైక్ ఇవ్వగా అతను సింగిల్ తీసాడు. దాంతో ఈ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో శివమ్ దూబే వరుసగా రెండు సిక్స్లు బాది సింగిల్ తీయగా.. రింకూ సింగ్ ఓ సిక్సర్ బాది క్యాచ్ ఔటయ్యాడు. చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ సింగిలే తీయడంతో టీమిండియా 185 పరుగులే చేసింది.