డబ్లిన్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అంతా ఊహించినట్లుగానే ఐపీఎల్ సంచలనం రింకూ సింగ్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అతనితో పాటు పేసర్ ప్రసిధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నారు.
గాయంతో ఏడాది పాటు జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్తోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్లో భారత కెప్టెన్గా బరిలోకి దిగిన అతను.. టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. కీలక టోర్నీకి ముందు కొన్ని మ్యాచ్లు ఆడాలనుకుంటున్నా. ఇన్నాళ్లు ఆటను ఎంతో మిస్సయ్యా. పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. ఐర్లాండ్ను మేం తక్కువ అంచనా వేయడం లేదు.
హోరాహోరీ పోరు ఉంటుందని ఆశిస్తున్నాం. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉందని ఓ పేస్ బౌలర్గా చెప్పగలను. వాతావరణం కూడా బాగుంది. మా జట్టులో ఇద్దరు అరంగేట్రం చేస్తున్నారు. రింకూ సింగ్, ప్రసిధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఇద్దరికీ ఆటను ఆస్వాదించాలని చెప్పాను.'అని బుమ్రా తెలిపాడు.
ఈ మ్యాచ్లో సత్తా చాటేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తెలిపాడు. స్కాట్లాండ్ తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని, అదే జోరును ఈ సిరీస్లోనూ కొనసాగిస్తామని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024కు ఇది ఆరంభమని తెలిపాడు. క్రైగ్ యంగ్ జట్టులోకి తీసుకున్నామని తెలిపిన పాల్ స్టిర్లింగ్.. ఈ పిచ్పై ఎక్స్ట్రా బౌలర్ ఎలా రాణిస్తాడో చూడాలని ఉందన్నాడు.
తుది జట్లు
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్బ్రినీ, లోర్కాన్ టక్కర్(కీపర్), హ్యారీ టెక్టార్, కర్టిస్ కాంఫెర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బ్యారీ మెక్కార్తీ, క్రైగ్ యంగ్, జోషువా లిటిల్, బెంజమిన్ వైట్
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్.