డబ్లిన్: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో ఐర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తెలిపాడు. ఈ మ్యాచ్లో రాణిస్తామనే నమ్మకం ఉందన్నాడు. సాధారణంగా ఇది హైస్కోరింగ్ పిచ్ అని చెప్పిన స్టిర్లింగ్.. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.
మరోవైపు టాస్ గెలిస్తే బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని టీమిండియా తాత్కలిక సారథి జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు. వాతావరణం ఈ రోజు మెరుగ్గా ఉందని, భారీ స్కోర్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. తన శరీరం బాగానే ఉందని, ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నాడు.

మ్యాచ్లు ఆడుతున్నా కొద్దీ తన శరీరం అలవాటు పడుతోందని, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పాడు. టీమ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పు చేయలేదని, విన్నింగ్ టీమ్నే కొనసాగిస్తున్నామని తెలిపాడు. సిరీస్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే జట్టులో మార్పు చేయలేదన్నాడు.
వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20లో టీమిండియా డక్వర్త్ లూయిస్ ప్రకారం 2 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో మూడు టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే రెండో టీ20 గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.
11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న విషయం తెలిసిందే. తొలి టీ20లో రెండు వికెట్లతో సత్తా చాటిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.
తుది జట్లు
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్బ్రినీ, లోర్కాన్ టక్కర్(కీపర్), హ్యారీ టెక్టార్, కర్టిస్ కాంఫెర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బ్యారీ మెక్కార్తీ, క్రైగ్ యంగ్, జోషువా లిటిల్, బెంజమిన్ వైట్
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్.