డబ్లిన్: ఐర్లాండ్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలిచిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(43 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 58)హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 38) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40), శివమ్ దూబే(16 బంతుల్లో 2 సిక్స్లతో 22 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెక్కార్తీ రెండు వికెట్లు తీయగా.. మార్క్ అడైర్, క్రైగ్ యంగ్, బెంజమన్ వైట్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఓపెనర్ ఆండీ బల్బిర్నీ(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72) రాణించినా ఫలితం లేకపోయింది.
అతనికి తోడు మరే బ్యాటర్ రాణించలేదు. చివర్లో మార్క్ అడైర్(15 బంతుల్లో 3 సిక్స్లతో 23) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/15), ప్రసిధ్ కృష్ణ(2/29), రవి బిష్ణోయ్(2/37) రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్(1/29) ఓ వికెట్ పడగొట్టాడు.
భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(0), లోర్కాన్ టక్కర్(0) డకౌట్గా పెవిలియన్ చేరారు. ఆ వెంటనే హ్యారీ టెక్టర్(7)ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలో ఐర్లాండ్ 3 వికెట్ల నష్టానికి 31 పరుగులే చేసింది.
క్రీజులోకి వచ్చిన కర్టిస్ కాంఫెర్(18)తో ఓపెనర్ ఆండీ బల్బిర్నీ ఆచితూచి ఆడాడు. వీలు చిక్కిన బంతిన బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబట్టాడు. 35 పరుగులతో క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీసాడు. కర్టీస్ కాంఫెర్(13)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన జార్జ్ డాక్రెల్(13)తో కలిసి బల్బిర్నీ చెలరేగాడు.
భారీ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను అనంతరం మరింత ధాటిగా ఆడాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రవి బిష్ణోయ్ సూపర్ రనౌట్తో పెవిలియన్ చేర్చాడు. అనవసర పరుగుకు ప్రయత్నించిన డాక్రెల్(13) రనౌట్గా వెనుదిరిగాడు.
దాంతో 6వ వికెట్కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయినా జోరు తగ్గించని బల్బిర్నీ.. భారీ సిక్సర్ బాది అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. బారీ మెక్కార్తీ(2)ని బుమ్రా ఔట్ చేయగా.. మార్క్ అడైర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతన్ని ఔట్ చేసి బుమ్రా భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.