టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పిచ్ కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్, బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2 ఫోర్లతో 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో ఫోర్, సిక్స్తో 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

పిచ్ నుంచి లభించిన సహకారంతో భారత బౌలర్లు.. హార్దిక్ పాండ్యా(3/27), జస్ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు.
రోహిత్ హాఫ్ సెంచరీ..
అనంతరం లక్ష్యచేధనకు టీమిండియా 12.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాగా.. రిషభ్ పంత్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్) సత్తా చాటాడు.
విరాట్ కోహ్లీ(1), సూర్యకుమార్ యాదవ్(2) తీవ్రంగా నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెన్ వైట్ తలో వికెట్ తీసారు.
నిరాశ పరిచిన కోహ్లీ..
97 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తొలి ఓవర్లో రోహిత్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను ఐర్లాండ్ సెకండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోలేకపోవడంతో బౌండరీ వచ్చింది. రెండో ఓవర్లో రోహిత్ వరుసగా 6, 4 బాది 15 పరుగులు పిండుకున్నాడు.
మార్క్ అడైర్ వేసిన మూడో ఓవర్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ(1) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్తో రోహిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది.
రోహిత్ శర్మకు గాయం..
జోషువా లిటిల్ వేసిన 9వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన రోహిత్.. మరుసటి ఓవర్ బౌండరీ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ మోచేతికి బంతి బలంగా తాకడంతో అతను రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. క్రీజులోకి సూర్య రాగా.. రిషభ్ పంత్ దూకుడుగా ఆడాడు.
సూర్య(2) సైతం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. శివమ్ దూబే సాయంతో రిషభ్ పంత్ భారీ సిక్సర్ బాది భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.