
దుబాయ్: ఆసియా కప్ 2022లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ రోహిత్ సేన గెలుపొందింది. హాంగ్ కాంగ్తో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా గ్రూప్-ఏ టాపర్గా సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ(44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఫామ్లోకి రాగా.. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 68 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్(26), రాహుల్(36) పర్వాలేదనిపించారు. హంకాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, మహమ్మద్ ఘజన్ఫర్ తలో వికెట్ తీసారు. 18 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అఫ్గాన్.. సూర్య సునామీ ఇన్నింగ్స్తో లయ తప్పింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో బాబర్ హయత్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41), కించిత్ షా(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.
193 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన హాంగ్ కాంగ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ యాసిమ్ ముర్తాజా(9) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ హయత్ ధాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు బాదడంతో హాంగ్ కాంగ్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. 6వ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ నిజకత్ ఖాన్(10)ను జడేజా రనౌట్ చేశాడు. దాంతో హాంగ్ కాంగ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. అనంతరం కించిత్ షాతో కలిసి బాబర్ హయత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
క్రీజులో పాతుకుపోయిన అతన్ని జడేజా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజిజ్ ఖాన్(14)ను ఆవేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే క్రీజులోకి వచ్చిన జీషాన్ అలీ, స్కాట్ ధాటిగా ఆడారు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో హాంగ్ కాంగ్ బ్యాటర్లు రెండు సిక్స్, రెండు ఫోర్లతో 21 పరుగులు పిండుకున్నారు. అయితే చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో భారత్ విజయం ఖాయమైంది.