ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ చరిత్ర సృష్టించారు. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్లో తొలి వికెట్కు 188 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్తో నాలుగో ఇన్నింగ్స్లో 150 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా బెన్ డకెట్-జాక్ క్రాలీ నిలిచారు. ఈ క్రమంలో 72 ఏళ్ల రికార్డ్ను అధిగమించారు. 1953లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్ జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఓపెనర్లు అలన్ రాయ్, జెఫ్రీ స్టోల్లీమోర్ 142 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పటికే వరకు భారత్పై నాలుగో ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్గా ఉంది. తాజాగా బెన్ డకెట్-జాక్ క్రాలీ ఈ రికార్డ్ను అధిగమించారు.

| జోడీ | దేశం | పరుగులు | వేదిక | సంవత్సరం |
| బెన్ డకెట్-జాక్ క్రాలీ | ఇంగ్లండ్ | 188 | హెడింగ్లీ | 2025 |
| అలన్ రాయ్-జెఫ్రీ స్టోల్లీమోర్ | వెస్టిండీస్ | 142 | పోర్ట్ ఆఫ్ స్పెయిన్ | 1953 |
| గ్యారీ స్టెడ్-మ్యాట్ హార్న్ | న్యూజిలాండ్ | 125 | ముంబై | 1964 |
| నజ్ముల్ హుస్సేన్ షాంటో-జాకీర్ హుస్సేన్ | బంగ్లాదేశ్ | 124 | ఛట్టోగ్రామ్ | 2022 |
ఓవరాల్గా ఇండియాపై నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక భాగస్వామ్య రికార్డ్ జోరూట్-జానీ బెయిర్ స్టో పేరిట ఉంది. 2022లో ఈ జోడీ 267 పరుగులు చేసింది. ఆ తర్వాత రాయ్ డయాస్-దులీప్ మెండీస్(1985లో 2016), ఏబీ డివిలియర్స్-ఫాఫ్ డుప్లెసిస్(2013లో 205) తర్వాతి జాబితాలో ఉన్నారు.
ఓపెనర్ల అద్భుత భాగస్వామ్యంతో పాటు జోరూట్(53 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 21/0 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్(170 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్తో 149) సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(126 బంతుల్లో 7 ఫోర్లతో 65), జోరూట్(84 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ ఇద్దరూ తొలి వికెట్కు 188 పరుగులు జోడించి భారత పతనాన్ని శాసించారు.భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కీలక క్యాచ్లు వదిలేయడం టీమిండియా కొంపముంచింది. తొలి ఇన్నింగ్స్లో 5 క్యాచ్లు వదిలేసిన భారత ఆటగాళ్లు.. రెండో ఇన్నింగ్స్లోనూ ఐదు క్యాచ్లు అందుకోలేకపోయారు. ఈ ఓటమితో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్తో పాటు రిషభ్ పంత్ సాధించిన రెండు శతకాలు వృథా అయ్యాయి. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జూలై 2న బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది.