ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. వైజాగ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమియండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 179 బ్యాటింగ్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 93 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు చేసింది.
యశస్వి మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అతని తర్వాత శుభ్మన్ గిల్(34), రజత్ పటీదార్(32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్తో పాటు రవిచంద్రన్ అశ్విన్(5 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇతర బ్యాటర్లు రాణించకున్నా.. తొలి రెండు సెషన్లలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చివరి సెషన్లో మాత్రం కాస్త తడబడింది.
నిరాశపర్చిన రోహిత్:
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అరంగేట్ర స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(14) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా ఆడిన రోహిత్.. ఇబ్బందికరంగా బ్యాటింగ్ చేశాడు. 41 బంతులాడి ఒక్క బౌండరీ కూడా బాదకుండా పెవిలియన్ చేరాడు.
గిల్ మరోసారి..:
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్తో యశస్వి జైస్వాల్ జట్టును ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ తమ ట్రేడ్ మార్క్ షాట్స్తో స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. 49 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జేమ్స్ అండర్సన్ విడదీసాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో శుభ్మన్ గిల్ను బోల్తా కొట్టించాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ రాగా.. యశస్వి జైస్వాల్ 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో టీమిండియా 31 ఓవర్లలో 103/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
అయ్యర్ తడబాటు కంటిన్యూ..:
రెండో సెషన్లోనూ ఈ జోడీ నిలకడగా బ్యాటింగ్ చేసింది. అయ్యర్ డిఫెన్స్కు పరిమితమైనా.. యశస్వి జైస్వాల్ తన జోరును కొనసాగించాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్(27)ను టామ్ హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

శతక్కొట్టిన యశస్వీ..:
రజత్ పటీదార్ బ్యాటింగ్కు రాగా.. యశస్వి జైస్వాల్ సూపర్ సిక్స్తో 151 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దాంతో టీమిండియా 63 ఓవర్లలో 225/3 స్కోర్తో రెండో సెషన్ను ముగించింది. మూడో సెషన్లోనూ జైస్వాల్ తన జోరు కొనసాగించాడు. మరోవైపు రజత్ పటీదార్ సైతం సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో ఇంగ్లండ్ స్పిన్నర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. క్రీజులో సెట్ అయిన రజత్ పటీదార్ దురదృష్టవశాత్తు రెహాన్ అహ్మద్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ బౌండరీలతో దూకుడు కనబర్చాడు. మరోవైపు యశస్వి సూపర్ బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే అక్షర్ పటేల్ను షోయబ్ బషీర్ఔట్ చేయడంతో ఐదో వికెట్కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లోకల్ భాయ్ శ్రీకర్ భరత్ వచ్చి రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓ భారీ సిక్సర్తో పాటు బౌండరీ బాదిన అతను.. అదే జోరులో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్తో యశస్వి మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు.