ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా(3/88), రవిచంద్రన్ అశ్విన్(3/68) తీన్మార్ వేయగా.. తొలి రోజు ఆటలో టీమిండియా సంపూర్ణ ఆదిపత్యం చెలాయించింది.
బ్యాటింగ్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 76 బ్యాటింగ్), రోహిత్ శర్మ(27 బంతుల్లో 3 ఫోర్లతో 24) అదిరిపోయే ఆరంభాన్ని అందించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీతో పాటు శుభ్మన్ గిల్(14 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 127 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్(88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. జానీ బెయిర్స్టో(58 బంతుల్లో 5 ఫోర్లతో 37), బెన్ డకెట్(39 బంతుల్లో 7 ఫోర్లతో 35) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/88), అశ్విన్(3/68) మూడేసి వికెట్లు తీయగా... అక్షర్ పటేల్(2/33), జస్ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. బజ్బాల్ వ్యూహాన్ని అమలు చేస్తూ ధాటిగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్ (35), జాక్ క్రాలే (20) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. 11 ఓవర్లలోనే అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కానీ ఆ తర్వాత భారత స్పిన్నర్లు రంగంలోకి దిగేసరికి ఇంగ్లండ్ కథ మారిపోయింది. 55/0తో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లండ్ అశ్విన్, జడేజా ధాటికి 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జో రూట్ (29), బెయిర్ స్టో (37) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నిదానంగా ఆడుతూ 108/3తో లంచ్ విరామానికి వెళ్లారు. రెండో సెషన్ ఆరంభంలోనే కుదురుకున్న రూట్ను జడేజా, బెయిర్ స్టోను అక్షర్ పటేల్ ఔట్ చేసి ఇంగ్లండ్కు షాకిచ్చారు. అనంతరం బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ బాధ్యతలు అందుకున్నాడు.
అయితే చివరి సెషన్ ఆరంభం నుంచి బెన్ స్టోక్స్ చెలరేగాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు సాధించాడు. సిక్సర్తో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అనంతరం మరింత ప్రమాదకరంగా మారుతూ వేగంగా పరుగులు సాధించాడు. అయితే బుమ్రా అద్భుతమైన బంతితో స్టోక్స్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో అతడి పోరాటం ముగిసింది.