టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ సహకారంతోనే సెంచరీ చేశానని ఓపెనర్ యశస్వి జైస్వాల్ తెలిపాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో గిల్ అండగా నిలిచాడని చెప్పుకొచ్చాడు. అతను ప్రశాంతంగా.. నిలకడగా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో తన పని మరింత సులువైందని తెలిపాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్లో యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 101) సెంచరీతో చెలరేగాడు. అతనితో పాటు , శుభ్మన్ గిల్(175 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 127 బ్యాటింగ్) కూడా సెంచరీ చేయగా.. రిషభ్ పంత్(102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 3 వికెట్లకు 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్(78 బంతుల్లో 8 ఫోర్లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
తొలి రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్స్తో మాట్లాడిన యశస్వి జైస్వాల్.. తన సెంచరీ క్రెడిట్ శుభ్మన్ గిల్దేనని తెలిపాడు. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ వరుసగా ఔటైన తర్వాత శుభ్మన్ గిల్, తాను ఇన్నింగ్స్ను నిలబెట్టి ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చామని తెలిపాడు.ఇది తన సెంచరీకి కలిసొచ్చిందని పేర్కొన్నాడు.

'సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటర్లంతా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్లోని వేసవికాలంతో పాటు నా బ్యాటింగ్ను ఆస్వాదించాను.ఈ మ్యాచ్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం. గత రెండు వారాలుగా ప్రాక్టీస్ మ్యాచ్లతో పాటు నెట్ సెసన్స్లో పాల్గొన్నాం. దాంతో నేను నిలకడగా బ్యాటింగ్ చేశాను. లూజ్ బాల్స్ను బౌండరీకి తరలించాను.శుభ్మన్ గిల్ ప్రశాంతంగా ఉంటూ.. నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. మిడిల్లో మేం చాలా మాట్లాడుకున్నాం. సెషన్ బై సెషన్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గిల్తో బ్యాటింగ్ చేయడం బాగుంది. నేనెప్పుడూ నన్ను నేను నమ్ముకుంటాను. బాగా ఆడాలనే ఆకాంక్ష, సంకల్పంతో బరిలోకి దిగుతాను. ఈ మ్యాచ్లో బంతి 100 శాతం స్వింగ్ అయ్యింది. కానీ నేను నాదైన శైలిలో నిలకడగా ఆడాను. బ్యాటింగ్ సమయంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. నా సహచర బ్యాటర్లకు చెప్పేది ఒక్కటే.. బంతిని జాగ్రత్తగా గమనించి ఆడండి.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే యశస్వి సెంచరీ నమోదు చేయడం గమనార్హం. లీడ్స్ మైదానంలో సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్గానూ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అతను 58 ఏళ్ల రికార్డ్ను అధిగమించాడు. 1967లో ఫరూఖ్ ఇంజనీర్.. లీడ్స్ మైదానంలో 87 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్గా ఉండగా.. జైస్వాల్ అధిగమించాడు. ఇంగ్లండ్పై అత్యధిక యావరేజ్తో 500 ప్లస్ టెస్ట్ రన్స్ నమోదు చేసిన బ్యాటర్గానూ జైస్వాల్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ను అధిగమించాడు. ఇంగ్లండ్పై బ్రాడ్మన్ 63 ఇన్నింగ్స్ల్లో 89.78 సగటుతో 5028 రన్స్ చేశాడు. యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్ల్లో 90.33 సగటుతో 813 పరుగులు చేశాడు.