టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు తాను ఆడిన 20 టెస్ట్ మ్యాచ్లను 20 వేదికల్లో ఆడిన తొలి ప్లేయర్గా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్ ద్వారా యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో నిలకడగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సెంచరీ దిశగా సాగుతున్నాడు. కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించిన యశస్వి జైస్వాల్.. శుభ్మన్ గిల్తో మూడో వికెట్కు అజేయంగా 90 ప్లస్ రన్స్ జోడించాడు.
హెడింగ్లీ వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్ యశస్వి జైస్వాల్కు 20వ టెస్ట్ మ్యాచ్.అయితే ఈ 20 మ్యాచ్లను వేర్వేరు వేదికలుగా ఆడాడు. వెస్టిండీస్ గడ్డపై టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్.. రోసౌ, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికలుగా రెండు మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్, కేప్టౌన్ వేదికగా ఆడాడు. భారత్లో 10 మ్యాచ్లు ఆడిన జైస్వాల్.. ఈ 10 మ్యాచ్లను వేర్వేరు వేదికల్లోనే ఆడాడు. ఇందులో రెండు బంగ్లాదేశ్పై, మరో మూడు న్యూజిలాండ్తో తలపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్లను పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ వేదికగా ఆడిన యశస్వి జైస్వాల్.. తాజా మ్యాచ్ను లీడ్స్ వేదికగా ఆడి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇలా 20 మ్యాచ్లను 20 వేదికల్లో ఆడిన తొలి ప్లేయర్గా యశస్వి నిలిచాడు.

టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్పై ఇప్పటికే 700 పరుగులు పూర్తి చేసుకున్న జైస్వాల్.. 800 పరుగుల దిశగా కొనసాగుతున్నాడు. జైస్వాల్.. డాన్ బ్రాడ్మన్ అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. ఇంగ్లండ్పై అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్గా బ్రాడ్మన్ రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్పై 10వ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మరో రెండు ఇన్నింగ్స్ల్లో అతను 1000 పరుగుల పూర్తి చేస్తే ఈ రికార్డ్ను అధిగమిస్తాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్(42) 91 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్(0) నిరాశపర్చినా.. గిల్, యశస్వి ఆచితూచి ఆడుతున్నారు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్తో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.