టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్గా రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో యశస్వి జైస్వాల్ 151 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
యశస్వికీ కెరీర్లో ఇది రెండో సెంచరీ. ఈ సిరీస్ తొలి మ్యాచ్లో 80 పరుగులు చేసిన యశస్వి.. అదే జోరును కొనసాగిస్తున్నాడు. 94 పరుగుల వద్ద టామ్ హార్ట్లీ బౌలింగ్లో సిక్స్ బాది యశస్వి జైస్వాల్ శతకం పూర్తి చేసుకోవడం విశేషం. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన యశస్వి.. ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు.

యశస్వి సెంచరీకి ఫిదా అయిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చప్పట్లతో అతనికి అభినందనలు తెలిపాడు. జోరూట్ సైతం యశస్విని ప్రత్యేకంగా అభినందించాడు. యశస్వి కూడా సెంచరీ అనంతరం తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్తో పాటు భారత అభిమానులు యశస్వికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
ఈ అసాధారణ ఇన్నింగ్స్తో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో 500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత, ఆసియా ప్లేయర్గా రికార్డు అందుకున్నాడు. ఇక 6 టెస్ట్ల్లోనే 55.67 సగటుతో 500 పరుగుల మైలురాయి అందుకున్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
23 ఏళ్ల వయసులో స్వదేశంతో పాటు విదేశాల్లో శతకం బాదిన ఆటగాడిగా యశస్వి.. దిగ్గజాల సరసన నిలిచాడు. రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, యశస్వి జైస్వాల్.. 23 ఏళ్ల వయసులో స్వదేశంతో పాటు విదేశాల్లో శతకాలు నమోదు చేశారు. ఈ నలుగురు ఆటగాళ్లు ముంబై రంజీ జట్టుకే చెందినవారు కావడం విశేషం.
యశస్వి జైస్వాల్(185 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 125 బ్యాటింగ్) భారీ శతకంతో టీమిండియా ఈ మ్యాచ్లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. కెప్టెన్ రోహిత్ శర్మ(14), శుభ్మన్ గిల్(34), శ్రేయస్ అయ్యర్(27) వికెట్లు త్వరగా కోల్పోయినా.. యశస్వి శతకంతో రెండో సెషన్ ముగిసే సమయానికి 63 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. యశస్వితో పాటు రజత్ పటీదార్(25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.