IND vs ENG women's Test: ఇంగ్లండ్తో ఏకైక టెస్ట్లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ముంబై వేదికగా గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 94 ఓవర్లలో 7 వికెట్లకు 410 పరుగులు చేసింది.
సతీష్ శుభా(76 బంతుల్లో 13 ఫోర్లతో 69), జెమీమా రోడ్రిగ్స్(99 బంతుల్లో 11 ఫోర్లతో 68), యస్తికా భాటియా(88 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 66), దీప్తి శర్మ(95 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 60 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. హర్మన్ప్రీత్ కౌర్(49) కీలక ఇన్నింగ్స్ ఆడింది.

క్రీజులో దీప్తి శర్మతో పాటు పూజవస్త్రాకర్(12 బంతుల్లో 4 నాటౌట్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీయగా.. నాట్ సీవర్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన(17), షెఫాలీ వర్మ(19) తీవ్రంగా నిరాశపరిచాడు. లారెన్ బెల్ బౌలింగ్లో స్మృతి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ కొద్ది సేపటికే కేట్ క్రాస్ బౌలింగ్లో షెఫాలి వర్మ సైతం క్లీన్ బౌల్డ్ అయ్యింది. దాంతో టీమిండియా 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో సతీష్ శుభా, జెమీమా అసాధారణ బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఈ ఇద్దరూ మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న ఈ ఇద్దరూ వరుసగా పెవిలియన్ చేరారు. క్రీజులోకి వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్, యస్తికా భాటియా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
హాఫ్ సెంచరీకి చేరువైన హర్మన్ప్రీత్ కౌర్ దురదృష్టకర రీతిలో రనౌటైంది. ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న యస్తికా భాటియాను చార్లీ డీన్ క్యాచ్ ఔట్ చేసింది. దాంతో టీమిండియా ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ స్నేహ్ రాణా(30)తో కలిసి దీప్తి శర్మ ఏడో వికెట్కు 92 పరుగులు జోడించింది. స్నేహ్ రాణా ఔటవ్వగా.. పూజా వస్త్రాకర్ సాయంతో దీప్తి శర్మ తొలి రోజు ఆటను ముగించింది.