మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. తొలి వన్డే ఆడిన కుల్దీప్ యాదవ్తో పాటు యశస్వి జైస్వాల్లపై వేటు పడింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఈ ఇద్దరూ తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మ్యాచ్తోనే యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. కానీ ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయాడు.
15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. గజ్జలో గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్తోనే రీఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్.. అంతగా ప్రభావం చూపలేకపోయాడు. 53 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. మోకాలి వాపుతో తొలి వన్డేకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. దాంతో తుది జట్టులో మార్పులు చేయాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ స్థానంలో తొలి వన్డే ఆడిన శ్రేయస్ అయ్యర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.

అద్భుతమైన హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో కోహ్లీ కోసం యువ ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ను పక్కనపెట్టాల్సి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం యశస్వికి వరుస అవకాశాలు ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. కానీ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో జట్టు నుంచి తప్పించలేని పరిస్థితిని తీసుకొచ్చాడు.
దాంతో విరాట్ కోహ్లీ కోసం యశస్వి జైస్వాల్ను పక్కనపెట్టాల్సి వచ్చింది. మరోవైపు కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తీకి అవకాశం ఇచ్చారు. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న కుల్దీప్ యాదవ్కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించామని రోహిత్ శర్మ తెలిపాడు. ఇంగ్లండ్తో టీ20ల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తీకి ప్రమోషన్ ఇస్తూ వన్డే జట్టులోకి కూడా తీసుకున్నారు. వన్డేల్లో అతని సత్తాను పరిశీలించేందుకే కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టి మరి తుది జట్టులో అవకాశం ఇచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే వరుణ్ చక్రవర్తీకి ఈ మ్యాచ్లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఆటగాళ్ల తప్పిదాలతో ఆ జట్టు నిలకడగా ఆడుతోంది. రెండు సునాయస క్యాచ్లతో పాటు ఓ డీఆర్ఎస్ విషయంలో టీమిండియా తప్పు చేసి మూల్యం చెల్లించుకుంది.