భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభమైంది.లీడ్స్లోని హెడ్డింగ్లీ మైదానం వేదికగా తొలి టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్తో ఈ మ్యాచ్ బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ నిమిషం పాటు మౌనం కూడా పాటించారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు మౌనం పాటించడంతో పాటు నల్లని రిబ్బన్లు ధరించారు.
ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని 241 మంది సజీవ దహనం కాగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విమానం జనవాసాలపై పడటంతో మృతుల సంఖ్య భారీ పెరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీఫంగా ఉండే మేఘానీ నగర్లోని జీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. దాంతో మెడికల్ హాస్టల్లోని 38 మంది మరణించారు.

ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ హృదయ విదారక ఘటనపై ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మృతులకు నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రాక్టీస్ మ్యాచ్ల సందర్భంగా కూడా టీమిండియా ఆటగాళ్లు మౌనం పాటించడంతో పాటు నల్ల రిబ్బన్లతో సంతాపం ప్రకటించారు. తాజా మ్యాచ్లోనూ ఇంగ్లండ్ ఆటగాళ్లతో కలిసి మరోసారి నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐతో పాటు అధికారిక బ్రాడ్కాస్టర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాయి.
అందరూ ఊహించినట్లుగానే టీమిండియా కాంబినేషన్ ఉంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. సాయి సుదర్శన్ అరంగేట్రం చేయగా.. 3009 రోజుల తర్వాత కరుణ్ నాయర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఛతేశ్వర్ పుజారా చేతుల మీదుగా సాయి సుదర్శన్ అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు.