
భారత మొనగాళ్లు చెలరేగాలి..
కాబట్టి భారత్కు ఉన్న రెండో ఆప్షన్ అద్భుతం జరగాలి. అవును బ్యాటింగ్లో మన మొనగాళ్లు చెలరేగాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ ఘోర అవమానానికి(78 ఆలౌట్) బదులు తీర్చుకుంటూ చెలరేగాలి. లార్డ్స్ టెస్ట్ మాదిరి ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారీ స్కోర్కు గట్టి పునాది వెయ్యాలి. 600కు పైగా పరుగులు చేయడమే కాకుండా మూడో రోజుతో సహా నాలుగో రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి. అప్పుడే డ్రా చేసుకోవడానికైనా.. లేదా లార్డ్స్ టెస్ట్ మాదిరి బౌలింగ్లో చెలరేగి విజయాన్నందుకోవడానికైన ఆస్కారం ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది జరగడం అసాధ్యమే అనిపిస్తోంది. కానీ మన స్టార్లు స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. ఈ అద్భుతం జరగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కోహ్లీ సెంచరీ చేయాలి..
ముందుగా ఈ అద్భుతం జరగాలంటే మూడో రోజు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను మరో 20 పరుగుల లోపే ముగించాలి. ఆ తర్వాత రోహిత్-రాహుల్ లార్డ్స్ టెస్ట్ మాదిరి తొలి వికెట్కు భారీ భాగస్వామ్యం అందించాలి. అనంతరం ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా తనదైన స్టైల్లో క్రీజులో పాతుకుపోవాలి. పరుగుల చేయకున్నా.. బంతులను తినేస్తూ.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ సహచర బ్యాట్స్మన్ స్వేచ్చగా ఆడేలా చేయాలి. సిడ్నీ టెస్ట్ మాదిరి భారత్ ఇన్నింగ్స్ కుప్పకూలకుండా గోడలా నిలబడాలి. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తనలోని పాత ఆటగాడిని బయటకు తీయాలి. వరుసగా విఫలమవుతున్నాననే ఒత్తిడిని పక్కకు పెట్టి.. ఆఫ్ స్టంప్కు బయటగా వచ్చే బంతులను వదిలేస్తూ అసలు సిసలు టెస్ట్ బ్యాట్స్మన్లా చెలరేగాలి. గత రెండుళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన సెంచరీని ఖాతాలో వేసుకోవాలి. ఒత్తిడిని ఆస్వాదించే పాత కోహ్లీ కనబడాలి.

రహానే, పంత్ సైతం..
ఇక అజింక్యా రహానే సైతం టాపార్డర్ అందించిన ఆరంభాలకు అండగా రాణిస్తూ కీలక భాగస్వామ్యాల్లో పాలుపంచుకోవాలి. మెల్ బోర్న్ టెస్ట్ మాదిరి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గట్టెక్కించాలి. వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం తనలోని డాషింగ్ బ్యాట్స్మన్ను నిద్రలేపాలి. ఆస్ట్రేలియా గడ్డపై కనబర్చిన సూపర్ ఫామ్ను రిపీట్ చేయాలి. విధ్వంసకర బ్యాటింగ్తో పరుగులు చేస్తూ మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. భారత బ్యాట్స్మన్లో కనీసం ఏ ఇద్దరైన సెంచరీలు బాదితే.. మరో ఇద్దరి హాఫ్ సెంచరీలతో రాణించాలి. అప్పుడు ఇదే ఉత్సాహంలో లోయరార్డర్ సైతం 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగలదు. అలా అయితే భారత్ 600 పరుగుల మార్క్ను ధాటగలదు.

బౌలర్లు చెలరేగితే..
ఈ స్కోర్ చేస్తే బౌలర్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆటను వారు చివరి రోజుకు తీసుకెళ్తే ప్రస్తుత లీడ్ మినహాయించగా.. ఇంగ్లండ్ ముందు 200-250 రన్స్ టార్గెట్ ఉంటుంది. అప్పుడు బౌలర్లు..బ్యాట్స్మన్ కష్టానికి ప్రతిఫలం ఇస్తూ విజయం కోసం పోరాడగలరు. లార్డ్స్ టెస్ట్ మాదిరి అద్భుతం చేయగలరు. ఫుల్ ఫామ్లో ఉన్న మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా అదే జోరు కొనసాగిస్తే ఇంగ్లండ్ బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టడం ఖాయం. వీరికి అండగా మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జడేజా తమ వంతుగా వికెట్లు తీస్తే అప్పుడు భారత్ కనీసం ఓటమి నుంచైనా గట్టెక్కగలదు. ఇక వర్షంతో ఒకటి నుంచి రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోతే భారత్ పని ఇంకా సులువవుతుంది.

జోరూట్ జోరు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజూ ఇంగ్లండ్దే! వాళ్ల ఆటతీరు బంతి నుంచి బ్యాట్కు బదిలీ అయింది తప్ప ఆడిన తీరు, క్రీజులో జోరు ఏమాత్రం తగ్గలేదు. పరుగుల హోరు ఆగలేదు. బ్యాటింగ్ వరుసలో టాపార్డర్ 'టాప్' ప్రదర్శన చేసింది. కెప్టెన్ జో రూట్ (165 బంతుల్లో 14 ఫోర్లతో 121) మరో శతకంతో చెలరేగగా, డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 11 ఫోర్లతో 70) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ఓవర్టన్ (24 బ్యాటింగ్), రాబిన్సన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications












