
లండన్: అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్న భారత టెయిలెండర్లు మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్)లకు డ్రెస్సింగ్ రూమ్లో ఘనస్వాగతం లభించింది. వీరోచిత బ్యాటింగ్తో 89 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించిన ఈ జోడీకి భారత ఆటగాళ్లంతా సలామ్ చేశారు. చుట్టూ చేరి చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్ల సంబరాలకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియోలో.. బుమ్రా, షమీ డ్రెస్సింగ్ రూమ్లోకి అడుగుపెట్టగానే గట్టిగా అరుస్తూ వారి విరోచిత ఇన్నింగ్స్ను ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇతర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ బుమ్రా-షమీ జోడీకి చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
అంతకుముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషభ్ పంత్(22) తీవ్రంగా నిరాశపరిచాడు. రాబిన్సన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే ఇషాంత్ శర్మ(16) కూడా ఔట్వడంతో భారత్ ఆలౌటవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన షమీ, బుమ్రా అద్భుతం చేశారు. అసాధారణ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ సహనాన్ని పరీక్షించారు.
ఇంగ్లండ్ బౌలర్లు రాకాసి బౌన్సర్లతో ఎదురుదాడికి దిగినా.. ధీటుగా బదులిచ్చారు. టాపార్డర్ బ్యాట్స్మన్ తరహాలో స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ బౌలర్లు మార్చినా.. ఫీల్డ్ సెటప్ జరిపినా.. కొత్త వ్యూహం రచించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో 58 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో షమీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోయిన్ అలీ వేసిన 106 ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించిన షమీ.. ఆ మరుసటి బంతిని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో భారీ సిక్సర్గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
షమీకి ఇది కెరీర్లో రెండో హాఫ్ సెంచరీకాగా.. ఈ రెండు ఇంగ్లండ్ గడ్డపైనే సాధించడం గమనార్హం. 2014 పర్యటనలో షమీ మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షమీ-బుమ్రా 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించడంతో భారత్ 298/8 వద్ద డిక్లేర్ ఇచ్చింది.
అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడు కీలక వికెట్లు కోల్పోయి డ్రా కోసం పోరాడుతోంది. తొలి ఓవర్లోనే ఆ జట్టుకు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను బుమ్రా డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫార్వార్డ్ ఫీల్డర్ సిరాజ్ చేతిలో పడింది. షమీ వేసిన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(0) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇండియాపై ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండా తొలిసారి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత షమీ బౌలింగ్లో హసీబ్ అహ్మద్ ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. అయితే ఇషాంత్ శర్మ అతన్ని ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో హిట్ మ్యాన్ ఊపిరి పీల్చుకున్నాడు.