
నాలుగో కెప్టెన్గా..
దాదాపు ఓటమి ఖాయామనుకున్న మ్యాచ్లో భారత్ అద్భుతం చేసింది. టేయిలండర్ల అసాధారణ బ్యాటింగ్తో భారీ ఆధిక్యాన్ని అందుకొని సరైన సమయంలో డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్పని పట్టి చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఈ విజయంలో కోహ్లీ మరో ఘనతను కూడా ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న నాలుగో కెప్టెన్గా నిలిచాడు. కోహ్లీ 63 టెస్ట్ మ్యాచులో 37 విజయాలు అందుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్ను అధిగమించాడు. లార్డ్స్ టెస్టుకు ముందు వరకు 36 టెస్ట్ విజయాలతో కోహ్లీ లాయిడ్ సమానంగా ఉన్నారు. ఇప్పుడు లాయిడ్ను కోహ్లీ వెనక్కినెట్టేశాడు.

అత్యధిక విజయాలతో..
ఇక టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్గా దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 109 మ్యాచుల్లో 53 విజయాలు అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న రెండో కెప్టెన్గా రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) కొనసాగుతున్నాడు. పాంటింగ్ 77 మ్యాచుల్లో 48 విజయాలు అందుకున్నాడు.
మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా 57 మ్యాచుల్లో 41 విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత్ తరఫున అత్యధిక టెస్ట్ విజయాలు సాధించింది విరాట్ కోహ్లీనే. రెండో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ 60 మ్యాచుల్లో 27 విజయాలు అందుకున్నాడు. 49 మ్యాచ్ల్లో 21 విజయాలతో సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మహమ్మద్ అజారుద్దీన్ (14), సునీల్ గవాస్కర్ (9), ఎంకే పటౌడీ (9)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కవ్వింపులే విజయాన్నందించాయి..
ఇంగ్లండ్ జట్టు కవ్వింపుల వల్లే లార్డ్స్ టెస్ట్ విజయం సాధించామని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపాడు. 'అన్ని రోజులూ మా వ్యూహాలను సరిగా అమలు చేసుకుంటూ వచ్చాము. మొదటి మూడు రోజులు పిచ్ సరిగా సహకరించలేదు.. కానీ తర్వాత మా బౌలర్లు చక్కగా రాణించారు. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా, షమి ఆడిన తీరు అత్యద్బుతం.
కష్టాల్లో వాళ్లు మాకు అండగా నిలిచారు. నిజంగా వారి ఆటకు సెల్యూట్ చెప్పాలి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు చేసిన పరుగులకు మేం విలువ కట్టలేం. భారత టెయిలెండర్లు పరుగులు చేయలేరని ఎన్నో అపవాదులు ఉన్నాయి. వాటన్నింటికీ బుమ్రా, షమీ సమాధానం ఇచ్చారు.
2014లో లార్డ్స్ టెస్ట్ గెలిచినప్పటికీ.. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ 60 ఓవర్లలోపే ఇంగ్లండ్ను ఆలౌట్ చేసి విజయాన్నందుకున్నాం. బుమ్రా, ఇషాంత్, షమీతో పాటు సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతను ఇక్కడ తొలి సారి ఆడుతున్నా అద్భుతంగా బౌలింగ్ చేశాడు'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

అద్భుత పోరాటం..
181/6 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్కు 271 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13) ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ సిరీస్లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఆగస్టు 25న(బుధవారం) లీడ్స్ వేదికగా ప్రారంభమవుతోంది.


Click it and Unblock the Notifications
