IND vs ENG:ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో విరాట్ కోహ్లీ అభిమానులు రచ్చ చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా బౌలింగ్కు దిగింది. అయితే చివరి నిమిషంలో ఈ ఐదు టెస్ట్ల సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు.
వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి రెండు మ్యాచ్లు ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అంతేకానీ ఆ కారణాలు ఏంటో తెలియజేయలేదు. సుమారు ఆరేళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుండటంతో విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలని భావించిన హైదరాబాద్ అభిమానులు ఈ మ్యాచ్ చూసేందుకు ఎగబడ్డారు.

కొందరైతే ఐదు రోజుల పాటు టికెట్లను కొనుగోలు చేశారు. తీరా మ్యాచ్ ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు కోహ్లీ ఆడటం లేదని తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కోహ్లీ లేకున్నా మ్యాచ్కు హాజరైన అభిమానులు.. అతనిపై తమకు ఉన్న ప్రేమను వినూత్న రితీలో చాటుకున్నారు. కోహ్లీ నామస్మరణతో ఉప్పల్ స్టేడియాన్ని దద్దరిల్లించారు.
కోహ్లీని ఎంతో మిస్సవుతున్నామని ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరైతే కోహ్లీ ఫొటోలు, రికార్డులను ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ అభిమానుల రచ్చకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక హైదరాబాద్ వేదిక విరాట్ కోహ్లీకి బాగా అచ్చొచ్చిన మైదానం.
2017లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్లో కోహ్లీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో భారత్ 208 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్తో జరిగే తాజా మ్యాచ్లోనూ విరాట్ కోహ్లీ భారీ స్కోర్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అతను మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు.
కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం వెనుక అనేక ఊహా గానాలు ప్రచారంలోకి వచ్చాయి. అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందని ఒకరంటే.. తీరిక లేని షెడ్యూల్తో కోహ్లీ విసిగిపోయాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. తొలి సెషన్ ముగిసే సరికి 8 వికెట్లకు 215 పరుగులు చేసింది. క్రీజులో మార్క్ వుడ్(7 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(43 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసారు. జస్ప్రీత్ బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.