టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. ఇప్పటికే కూతురి బర్త్ డే కోసం ఓ అంతర్జాతీయ మ్యాచ్కు దూరంగా ఉన్న కోహ్లీ.. రెండో బిడ్డ కోసం ఏకంగా ఓ సిరీస్ మొత్తానికి డుమ్మా కొట్టేందుకు సిద్దమవ్వడం సరికాదని మండిపడుతున్నారు.
దేశం కంటే కుటుంబం ఎక్కువ? అని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్కు కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్ మ్యాచ్లు కోహ్లీ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. దాంతో అనేక ఊహాకథనాలు తెరపైకి వచ్చాయి. కోహ్లీ తల్లి అనారోగ్యానికి గురైందని, అతని సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ప్రచారం జరిగింది.

తన తల్లి ఆరోగ్యంగానే ఉందని కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పష్టం చేయగా.. కోహ్లీ-అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తెలిపాడు. ఈ గుడ్ న్యూస్పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. అతని హేటర్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
ఓ అంతర్జాతీయ క్రికెటర్ అయిన కోహ్లీకి ఇది ఏ మాత్రం తగదని, రెండో బిడ్డ కోసం సిరీస్ మొత్తానికి దూరమవడం భావ్యం కాదని మండిపడుతున్నారు. దేశం కంటే కుటుంబమే ఎక్కువైనప్పుడు.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని హితవు పలుకుతున్నారు.

ఈ వ్యవహారంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. నేషనల్ డ్యూటీని పక్కనపెట్టి రెండో బిడ్డ కోసం వేచి చూస్తున్న కోహ్లీపై రోహిత్ శర్మ అభిమానులు విమర్శలు గుప్పిస్తుండగా.. విరాట్ ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు.
ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, కుటుంబమే తొలి ప్రాధాన్యతగా ఉంటుందని బదులు ఇస్తున్నారు. కుటుంబం కంటే దేశం ఎక్కువ కాదని, ఎవరైనా తన కుటుంబం కోసం కష్టపడుతారని గుర్తు చేస్తున్నారు. చాలా మంది క్రికెటర్లు తమ బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో ఆటకు దూరమయ్యారని నెమరువేస్తున్నారు.

గతంలో రోహిత్ శర్మ కూడా తన కూతురు కోసం అంతర్జాతీయ మ్యాచ్లకు దూరమయ్యాడని గుర్తు చేస్తున్నారు. అయితే ఇతర ఆటగాళ్లు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు దూరమయ్యారని, కోహ్లీలా ముందు నుంచే వెళ్లలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీకి ఎవరూ సాటి రారని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. జీవా పుట్టిన సమయంలో ధోనీ ఆస్ట్రేలియాలో వన్డే ప్రపంచకప్ 2015 ఆడుతున్నాడని, టోర్నీ ముగిసిన తర్వాతనే తన కూతుర్ని చూశాడని గుర్తు చేస్తున్నారు. దేశం కోసం ఆడటంలో ధోనీ తర్వాతే కోహ్లీ, రోహిత్ ఉంటారని కామెంట్ చేస్తున్నారు.

ఇలా కుటుంబం కోసం విరాట్ కోహ్లీ మ్యాచ్లకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి కాదు. వామికా పుట్టినప్పుడు కూడా కోహ్లీ.. కీలక ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే ఇండియాకు వచ్చేసాడు.
గత నెలలో అఫ్గానిస్థాన్ జరిగిన మూడు టీ20ల సిరీస్లోనూ తొలి మ్యాచ్కు కోహ్లీ ఇలానే డుమ్మా కొట్టాడు. వామికా(జనవరి 11) పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు తొలి టీ20 ఆడలేదు. అప్పుడు కూడా ఇదే తరహాలో కోహ్లీ విమర్శలు ఎదుర్కొన్నాడు.
కోహ్లీ గైర్హాజరీలో హైదరాబాద్ టెస్ట్లో టీమిండియా ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఉంటే భారత్ గెలిచేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక కోహ్లీ చివరి మూడు టెస్ట్లు ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.