ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. గత 19 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆ రికార్డ్ను అందుకునేందుకు విరాట్ కోహ్లీ 94 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో నాగ్పూర్ వేదికగా గురువారం జరిగే తొలి వన్డేలో ఈ పరుగులు చేసినా.. లేదా ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లో చేసినా.. 19 ఏళ్ల రికార్డ్ను విరాట్ కోహ్లీ అధిగమించనున్నాడు.
ప్రస్తుతం ఆ రికార్డ్ టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలు రాయి అందుకున్న క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్ 350 వన్డే ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించాడు. 2006లో పాకిస్థాన్తో పెష్వార్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా సచిన్ ఈ ఫీట్ సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా డక్వర్త్ లూయిస్ ప్రకారం 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ 283 వన్డే ఇన్నింగ్స్ల్లో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. ఇందులో 50 శతకాలతో పాటు 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో 94 పరుగులు చేస్తే వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి అందుకోనున్నాడు. గతేడాది మూడే వన్డేలు ఆడిన కోహ్లీ.. శ్రీలంకతో 58 పరుగులే చేశాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో కోహ్లీ 94 పరుగులు చేస్తే సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్ను అధిగమించనున్నాడు.
ప్రస్తుతం ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత కుమార సంగక్కర ఉన్నాడు. అతను 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 14 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అతనికి ఈ ఫీట్ అందుకోవడానికి 378 ఇన్నింగ్స్లు పట్టింది. మరే బ్యాటర్ వన్డేల్లో 14వేల పరుగులు చేయలేదు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోయే వన్డే ఫార్మాట్తో మళ్లీ రిథమ్ అందుకోవాలనే కసితో కోహ్లీ ఉన్నాడు. ఈ సిరీస్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు కోహ్లీ రాణించడం చాలా కీలకం.