అందరూ ఊహించనట్లుగానే ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను సెలెక్షన్కు అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది. చివరి మూడు టెస్ట్లకు 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ వివరాలను శనివారం వెల్లడించింది.
'వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు కోహ్లీ అందుబాటులో లేడు. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తోంది. మద్దతుగా నిలుస్తోంది.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్ జట్టులోకి తారా జువ్వలా దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ.. అంచెలంచెలుగా ఎదిగాడు. తన అసాధారణ ఆట తీరుతో భారత క్రికెట్ ముఖ చిత్రంగా మారాడు.

2011లో టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి సొంతగడ్డపై జరిగిన ప్రతి టెస్ట్ సిరీస్ ఆడాడు. కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో సిరీస్ ఒక్క మ్యాచ్ కూడా ఆడటంలేదు. దాంతో 13 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై విరాట్ కోహ్లీ ఓ టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. టెస్ట్ కెప్టెన్గా భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లీ.. అత్యధిక కాలం జట్టుగా నెంబర్ వన్ ర్యాంక్లో కొనసాగించాడు.
2016 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు వరుసగా 42 నెలల పాటు ర్యాంకింగ్స్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగింది. మరోవైపు అండర్సన్, కోహ్లీ మధ్య రసవత్త పోరును మళ్లీ చూసే అవకాశాలు కనిపించడం లేదు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీపై అండర్సన్ ఆధిపత్యం చెలాయించి నాలుగు సార్లు ఔట్ చేశాడు. కానీ నాలుగేళ్ల తర్వాత ఇదే ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీ తన బ్యాట్తోనే సమాధానిచ్చాడు.

అండర్సన్ బౌలింగ్ను చీల్చి చెండాడాడు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. భారత్, ఇంగ్లండ్ మధ్య వచ్చే ఏడాది టెస్ట్ సిరీస్ జరగనుంది. 42 ఏళ్ల వయసున్న అండర్సన్.. అప్పటి వరకు ఆటలో కొనసాగడం కష్టంగా మారడంతో ఈ ఇద్దరి ముఖా ముఖి పోరును కోరుకుంటున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
తొలి రెండు టెస్ట్ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి ఐదు టెస్ట్ల సిరీస్ 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా ప్రారంభం కానుంది.