భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలెక్షన్ కమిటీపై వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఫైర్ అయ్యాడు. ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా హిందీ కొటేషన్ షేర్ చేసిన ఉమేశ్ యాదవ్ బోర్డుపై తన పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.
ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది. పెద్దగా మార్పులేమి చేయకపోయినా.. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్పై వేటు వేసింది. గాయంతో ఇబ్బంది పడుతున్నాడని పక్కనపెట్టేసింది. ఆవేశ్ ఖాన్ను తప్పించి యువ పేసర్ ఆకాశ్ దీప్కు అవకాశం ఇచ్చింది.

దాంతో తీవ్ర నిరాశకు గురైన ఉమేశ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. 'పుస్తకాలకు దుమ్ముపట్టినంత మాత్రానా అందులోని కథలకు విలువ తగ్గదు.'అనే ఓ హిందీ కొటేషన్ను షేర్ చేశాడు.
సొంతగడ్డపై టెస్ట్ల్లో ఉమేశ్ యాదవ్కు మంచి రికార్డ్ ఉంది. 2018 నుంచి 11 మ్యాచ్లు ఆడిన ఉమేశ్ యాదవ్ 43 వికెట్లు తీసాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతతో పాటు ఒకసారి 10 వికెట్ల ఘనత ఉంది. అయినా ఉమేశ్ యాదవ్ను పట్టించుకోవడం లేదు.

ప్రస్తుతం భారత జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కనబడుతోంది. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో మిడిలార్డర్ బలహీనంగా ఉండగా.. బౌలింగ్లో బుమ్రాకు సహకారంగా మరో పేసర్ రాణించలేకపోతున్నాడు.
అయితే టీమిండియా భవిష్యత్తు దృష్ట్యా బీసీసీఐ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకే ప్రాతినిథ్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్పై వేటు వేసినా.. సీనియర్ బ్యాటర్ అయిన చతేశ్వర్ పుజారాకు అవకాశం ఇవ్వలేదు. కుర్రాళ్లనే కొనసాగించారు. ఉమేశ్ యాదవ్ను కూడా ఈ కారణంతోనే పట్టించుకోవడం లేదు.