IND vs ENG: వచ్చే ఏడాది భారత్ పర్యటనకు రానున్న ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన వివరాలను సోమవారం వెల్లడించింది. ఈ పర్యటనకు ముగ్గురు అనామక ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఆఫ్ స్పిన్నర్లు అయిన టామ్ హార్ట్లీ, ఫోయబ్ బషీర్తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్లు తొలిసారి ఇంగ్లండ్ పిలుపును అందుకున్నారు.
గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టుకు దూరమైన జాక్ లీచ్.. భారత్ పర్యటనలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే క్రిస్ వోక్స్, విల్ జాక్స్, డాన్ లారెన్స్, లియామ్ డాస్లపై ఈసీబీ వేటు వేసింది. భారత్లో స్పిన్ పిచ్లు ఉండనున్న నేపథ్యంలో జట్టులోకి నలుగురు స్పిన్నర్లను తీసుకుంది. గత భారత పర్యటనలో సత్తా చాటిన వికెట్ కీపర్ బెన్ ఫోక్స్కు మళ్లీ జట్టులో చోటు దక్కింది. ఓలీ పోప్ కూడా ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

2013 నుంచి ఇంగ్లండ్ ఇప్పటి వరకు భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవలేదు. గత పర్యటనలో జోరూట్ సారథ్యంలోని ఇంగ్లండ్ను టీమిండియా 3-1 తేడాతో ఓడించింది.
డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా జరగనున్న ఈ ఐదు టెస్ట్ల సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్కు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్;
తొలి టెస్ట్: జనవరి 25-29(హైదరాబాద్)
రెండో టెస్ట్: ఫిబ్రవరి 2-6(వైజాగ్)
మూడో టెస్ట్: ఫిబ్రవరి 15-19(రాజ్కోట్)
నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 23-27(రాంచీ)
ఐదో టెస్ట్: మార్చి 7-11(ధర్మశాల)
భారత పర్యటనకు ఎంపికైన ఇంగ్లండ్ టీమ్: బెన్ స్టోక్స్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, జోరూట్, మార్క్వుడ్.