ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్కు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. తొడ కండరాల గాయంతో జడేజా, కుడి తొడలో నొప్పితో కేఎల్ రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో చేరారు.
మూడో టెస్ట్లోపు కేఎల్ రాహుల్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనుండగా.. జడేజా మాత్రం నాలుగో టెస్ట్కు అందుబాటులోకి వస్తాడని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. తొడ కండరాల గాయం నుంచి జడేజా కోలుకోవడానికి 6-8 వారాలు పడుతుందని, ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరిగే మూడో టెస్ట్కు అందుబాటులోకి రాడని ఓ ఎన్సీఏ అధికారి తెలిపాడు.

చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ.. ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు కూడా అందుబాటులో ఉండట్లేదని సమాచారం. ప్రస్తుతం మహమ్మద్ షమీ లండన్లో ఉన్నాడు. స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నాడు. గాయం నయమయ్యేందుకు అతను ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాడని, ఈ పరిస్థితుల్లో అతను టెస్ట్ మ్యాచ్ ఆడలేడని, ఐపీఎల్ 2024లోనే రీఎంట్రీ ఇస్తాడని ఓ ప్రముఖ వెబ్సైట్ పేర్కొంది.
మహమ్మద్ షమీ గైర్హాజరీలో బరిలోకి దిగిన మహమ్మద్ సిరాజ్ తేలిపోయాడు. ఓ వైపు బుమ్రా సత్తా చాటినా మరోవైపు సిరాజ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దాంతో టీమిండియాలో షమీ లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. బౌలింగ్తో పాటు లోయరార్డర్లో షమీ హిట్టింగ్ కూడా చేయగలడు.
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఎప్పుడు వస్తాడనేదానిపై క్లారిటీ లేదు. తన తల్లి అనారోగ్యం గురించి జరిగిన ప్రచారం అవాస్తవమని కోహ్లీ సోదరుడు వికాస్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు.
ఐదు టెస్ట్ల సిరీస్ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్ట్కు ముందు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కుర్రాళ్లతో బరిలోకి దిగనుంది. మిడిలార్డర్లో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్ టీమిండియాను కలవరపెడుతుంది. సునాయసంగా గెలవాల్సిన హైదరాబాద్ టెస్ట్ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. 231 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.