
బౌలర్లు విఫలమైనా..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. మొయిన్ అలీ(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43 నాటౌట్), జానీ బెయిర్ స్టో(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49) చెలరేగారు. ఈ ఇద్దరికి తోడుగా లియామ్ లివింగ్ స్టోన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(0/54), రాహుల్ చాహర్(1/43) తేలిపోగా.. మహమ్మద్ షమీ(3/40) మూడు వికెట్లతో పర్వాలేదనిపించాడు.
జస్ప్రీత్ బుమ్రా(1/26) ఓ వికెట్ తీయగా.. అశ్విన్(0/23) కట్టడిగా బౌలింగ్ చేశాడు. అనంతరం భారత్ 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు.

ఓపెనర్ల శుభారంభం..
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇషాన్ కిషన్ ఇచ్చిన రెండు క్యాచ్లను ఇంగ్లండ్ ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాలను అందుకున్న ఇషాన్ దుమ్మురేపాడు. ఇక ఆరంభం నుంచే కేఎల్ రాహుల్ చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో స్ట్రైట్గా కేఎల్ రాహుల్ కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది. రాహుల్ ధాటికి బంతి జాడలేకుండా పోయింది.

రాహుల్.. సూపర్ సిక్స్
ఇక రాహుల్ జోరుకు ఇషాన్ కిషన్ కూడా తోడవడంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 59 రన్స్ చేసింది. అనంతరం మోయిన్ అలీ బౌలింగ్లో 4, 6 బాదిన రాహుల్ .. మార్క్ వుడ్ వేసిన 9వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించి 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే జోరులో మరుసటి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. మరోవైపు ఇషాన్ కిషన్ పరుగుల వరద పారించాడు.

చుక్కలు చూపించిన ఇషాన్..
ఆదిల్ రషీద్ వేసిన 12వ ఓవర్లో 1,6,2,6,4, వైడ్, 4తో ఉగ్రరూపం దాల్చాడు. ఈ ఓవర్లో అతను కొట్టిన రెండు సిక్స్లు మైదానం బయటపడటం గమనార్హం. అయితే ఆ మరుసటి ఓవర్లోనే కోహ్లీ(11) భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ మొయిన్ అలీ వేసిన 14వ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్స్లు బాదాడు. మొదటి సిక్స్ను సింగిల్ హ్యాండ్తో కొట్టిన పంత్.. రెండో సిక్స్కు బంతిని మైదానం బయటపడేసాడు. అనంతరం ఫోర్ బాదిన ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ చాలనుకొని పెవిలియన్ చేరాడు. దాంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రాగా.. స్కోర్ బోర్డు వేగం తగ్గింది.

పంత్ సూపర్ ఫినీష్..
ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సూర్య, పంత్ క్విక్ సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేశారు. అయితే డేవిడ్ విల్లే బౌలింగ్లో బౌండరీ బాదిన సూర్య(8).. అదే జోరులో వినూత్న షాట్ ఆడబోయి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. క్రీజులో కుదురుకునే టైమ్ తీసుకోవడంతో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 20 పరుగులు అవసరమయ్యాయి. క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో హార్దిక్ రెండు బౌండరీలు బాదగా.. రిషభ్ పంత్ భారీ సిక్స్ర్తో మ్యాచ్ను ముగించేసాడు.


Click it and Unblock the Notifications












