దుబాయ్: టీ20 ప్రపంచకప్కు సన్నాహకంగా భారత్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో మొయిన్ అలీ(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43 నాటౌట్), జానీ బెయిర్ స్టో(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49) చెలరేగారు. ఈ ఇద్దరికి తోడుగా లియామ్ లివింగ్ స్టోన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30) మెరుపులు మెరిపించడంతో భారత్ ముందు ఇంగ్లండ్ 189 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(0/54), రాహుల్ చాహర్(1/43) తేలిపోగా.. మహమ్మద్ షమీ(3/40) మూడు వికెట్లతో పర్వాలేదనిపించాడు. జస్ప్రీత్ బుమ్రా(1/26) ఓ వికెట్ తీయగా.. అశ్విన్(0/23) కట్టడిగా బౌలింగ్ చేశాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు జోస్ బట్లర్(18), జాసన్ రాయ్(17)లను మహమ్మద్ షమీ తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. బట్లర్ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ.. రాయ్ని క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 51 రన్స్ చేసింది. క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. స్పిన్నర్లు రాహుల్ చాహర్, అశ్విన్ బౌలింగ్లో వరుస బౌండరీలతో జోరు కనబర్చారు.
చాహర్ బౌలింగ్లో డేవిడ్ మలాన్(18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్.. రాహుల్ చాహర్ను టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదాడు. అతను వేసిన 14 ఓవర్లో 6, 4, 4తో చెలరేగిన లివింగ్ స్టోన్ 17 రన్స్ పిండుకున్నాడు. అయితే ఆ మరుసటి ఓవర్లోనే షమీ అతని దూకుడు కళ్లెం వేయగా.. క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ అదే జోరును కనబర్చాడు. వరుస బౌండరీలతో చెలరేగాడు. మరోవైపు హాఫ్ సెంచరీకి చేరువైన జానీ బెయిర్ స్టోను బుమ్రా బౌల్డ్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో మొయిన్ అలీ.. వరుసగా 4, 6,6 బాది 21 రన్స్ పిండుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 188 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.