ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అసాధారణ ప్రదర్శనతోనే ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ 1-2తో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. లియామ్ లివింగ్స్టోన్(24 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 43) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 40), అభిషేక్ శర్మ(14 బంతుల్లో 5 ఫోర్లతో 24) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్కు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-2తో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. ఆదిల్ రషీద్ అసాధారణ ప్రదర్శన తమ విజయవకాశాలను దెబ్బతీసాడని తెలిపాడు. 'సెకండ్ ఇన్నింగ్స్ టైమ్లో డ్యూ వస్తుందని భావించాను. హార్దిక్ పాండ్యా-అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంత వరకు ఈ మ్యాచ్ మా చేతుల్లోనే ఉందనుకున్నాను. ఈ గెలుపు క్రెడిట్ ఆదిల్ రషీద్దే. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు.
మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే మేం జట్టులో ఎక్కువ స్పిన్నర్లను తీసుకుంటున్నాం. టీ20 మ్యాచ్ల్లో ఎప్పుడూ మేం ఏదో ఒకటి నేర్చుకుంటాం. బ్యాటింగ్ విభాగంపై మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో మా తప్పిదాలపై చర్చిస్తాం. వచ్చే మ్యాచ్ల్లో షమీ రాణిస్తాడనే నమ్మకం ఉంది. వరుణ్ చక్రవర్తీ నెట్స్లో తీవ్రంగా కష్టపడ్డాడు. అతను ఎంతో క్రమశిక్షణ గల బౌలర్. ఎంతో కష్టపడుతాడు. అందుకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతున్నాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.