ఇంగ్లండ్తో నాలుగో టీ20లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఒకే ఓవర్లో తాము మూడు వికెట్లు కోల్పోవడం మరి దారుణమని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 15 పరుగులతో ఇంగ్లండ్ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ పవర్ ప్లేలో టీమిండియా దారుణంగా విఫలమైంది. సకీబ్ మహమూద్ వేసిన రెండో ఓవర్లోనే సంజూ, తిలక్, సూర్య ఔటయ్యారు. దాంతో 12 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. బౌలింగ్ పవర్ ప్లేలో ఇంగ్లండ్ 62 పరుగులతో శుభారంభం చేసింది. అయితే బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే హాఫ్ సెంచరీలతో ఆదుకుంటే బౌలింగ్లో కంకషన్ సబ్స్టిట్యూట్ హర్షిత్ రాణా చెలరేగి విజయాన్నందించాడు.

అలా ఔటవ్వడం దారుణం..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ ఈ ముగ్గురు ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు మద్దతు అద్భుతంగా ఉంది. మేం ఏమాత్రం వెనుకంజ వేయాలనుకోలేదు. మేం ఎలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలో మా కుర్రాళ్లకు బాగా తెలుసు. అయితే ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడం అనేది మాత్రం దారుణం. కానీ సానుకూలాంశం ఏంటంటే.. మిడిలార్డర్లో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా తమ అనుభవాన్ని ఉపయోగించి రాణించడం.
మేం ఎప్పుడూ మాట్లాడేది ఇదే. నెట్స్లో ఎలా ఆడుతారో.. మ్యాచ్లోనూ అలానే స్వేచ్చగా ఆడాలని మా ఆటగాళ్లకు చెబుతాం. మా కుర్రాళ్ల అద్భుతంగా ప్రాక్టీస్ చేసి మ్యాచ్లోనూ రాణించారు. ఈ విజయం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. మేం సరైన దారిలోనే వెళ్తున్నాం. పవర్ ప్లే ముగిసిన తర్వాత 7-10 ఓవర్ల మధ్య మ్యాచ్పై పట్టు సాధించవచ్చని భావించా. అనుకున్నట్లుగానే మేం కొన్ని వికెట్లు తీసాం. హర్షిత్ రాణా మూడో పేసర్గా వచ్చి అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతని బౌలింగ్ అసాధారణం. ముంబై వేదికగా జరిగే ఆఖరి టీ20లోనూ విజయం సాధిస్తాం'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఆదుకున్న హార్దిక్, దూబే
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్(3/35) మూడు వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్(2/32) రెండు వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(3/33), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా. వరుణ్ చక్రవర్తీ(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్(1/35), అక్షర్ పటేల్(1/26) చెరో వికెట్ తీసుకున్నారు.