ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో మ్యాచ్లోనూ టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. మ్యాచ్ సాగుతున్నాకొద్ది వికెట్లో ఎలాంటి మార్పు ఉంటుందని అనుకోవడం లేదు.
రాజ్కోట్ ఎప్పుడూ మంచి వికెట్. ఈ పిచ్ కూడా అన్ని విధాల బాగుంటుందని అనుకుంటున్నా. మేం విభిన్నమైన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. అయితే పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కూడా ముఖ్యమే. గత మ్యాచ్లో తిలక్ ఇదే చేసి చూపించాడు. ప్రస్తుతం మేం మూడు మ్యాచ్ల సిరీస్గా భావిస్తున్నాం. కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినిచ్చి షమీని తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

వరుసగా మూడు మ్యాచ్ల్లో సూర్య టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం గమనార్హం. దాంతోనే సూర్య టాస్ గెలవగానే ప్రేక్షకులు గట్టి అరుస్తూ అతనికి అభినందనలు తెలియజేశారు.
ఈ వికెట్పై బ్యాటింగ్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. 'పిచ్ చూడటానికి బాగుంది. ఈ సవాల్ను స్వీకరిస్తున్నాం. చేజింగ్ కూడా చేసేవాళ్లం. వికెట్ బాగుంది. మా కుర్రాళ్లంతా ఈ మ్యాచ్ కోసం బాగా సన్నదమయ్యారు. ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. గత మ్యాచ్ గొప్ప మ్యాచ్గా నిలిచింది. మేం అద్భుతంగా పోరాడాం. ఈ రోజు కూడా అదే తరహా ప్రదర్శనను కొనసాగించాలనుకుంటున్నాం. భారత్ ఎంత బాగా ఆడుతుందో మాకు బాగా తెలుసు. భారత్ చాలా బలమైన జట్టు. మేం భారీ లక్ష్యాన్ని నమోదు చేస్తేనే డిఫెండ్ చేసుకోగలుగుతాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. జేమీ స్మిత్ కీపింగ్ చేస్తాడు. సాల్ట్ కాస్త పిక్క నొప్పితో బాధపడుతున్నాడు.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డక్కెట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ.