
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్పై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో రాహుల్(248 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 127 బ్యాటింగ్) సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. దాంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సెంచరీతో రాహుల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రాహుల్కు ఇది 6వ టెస్ట్ సెంచరీ కాగా... ఓవరాల్గా ఇంగ్లండ్పై మూడోది. ఇక ప్రతిష్ఠాత్మక లార్డ్స్ స్టేడియంలో సెంచరీ బాదిన మూడో భారత ఓపెనర్గా ఘనత సాధించిన కేఎల్ రాహుల్.. ఆసియా వెలుపల నాలుగు టెస్టు సెంచరీలు బాదిన దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు.
దాంతో రాహుల్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే అతని ప్రేయసి అతియా శెట్టితో పాటు ఆమె తండ్రి అయిన సునీల్ శెట్టి రాహుల్ను కొనియాడాడు. ఇన్స్టా వేదికగా రాహుల్ సెంచరీ సెలెబ్రేషన్స్ను షేర్ చేసిన సునీల్ శెట్టి.. 'క్రికెట్ మక్కాలో సెంచరీ చేసిన రాహుల్కు అభినందనలు. ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకు ఉండాలి. నా బర్త్డేకు నువ్వు ఇచ్చిన ఈ గిఫ్ట్ అదిరిపోయింది'అంటూ క్యాప్షన్గా పేర్కొన్నాడు. అతియా శెట్టి సైతం రాహుల్ సెంచరీపై పోస్ట్ చేసింది. కేఎల్ రాహుల్ను ట్యాగ్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎరుపు రంగు హార్ట్ ఐకాన్ను పోస్ట్ చేసింది.
అయితే ఈ పోస్ట్లపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాహుల్-అతియా శెట్టిలు గత కొంతకాలంగా పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ జోడి తమ బంధంపై అధికారికంగా ఏ ప్రకటన చేయకపోయినప్పటికీ.. తమ మధ్య ఉన్నది ప్రేమేనని అర్థమయ్యేలా అనేక పనులు చేశారు. బాహటంగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. సోషల్ మీడియా వేదికగా లవ్ ఏమోజీలతో రచ్చ చేశారు. తాజా ఇంగ్లండ్ పర్యటనకు రాహుల్.. అతియా శెట్టిని కూడా తీసుకెళ్లాడు. బీసీసీఐకి సైతం తన ఫియాన్సీ అని చెప్పాడు. అక్కడ విరుష్క, ఇతర జంటలతో కలిసి ఈ జోడీ విరామ సమయాన్ని ఆస్వాదించింది.
వీరి ప్రేమ పుకార్లపై సునీల్ శెట్టి సైతం చాలా సార్లు స్పందించాడు. వాళ్లు ఆనందంగా ఉంటే చాలు అంటూ కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే సునీల్ శెట్టి పోస్ట్ అభిమానులు తమదైన శైలిలో మార్చుతున్నారు. 'కంగ్రాట్స్ అల్లూడూ.. నా బర్త్డే గిఫ్ట్ అదిరింది'అనే అర్థంలోనే సునీల్ శెట్టి కామెంట్ చేశాడని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
వర్షం అంతరాయం కలిగించడంతో నెమ్మదించిన పిచ్పై భారత బ్యాట్స్మెన్ వికెట్లను ఎంచక్కా పడగొట్టొచ్చు అనుకున్న ఇంగ్లండ్ ఎత్తుగడ పారలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రూట్ నిర్ణయం బెడిసికొట్టింది. భారత ఓపెనర్లు జోరు ప్రత్యర్థి ఆశల్ని, అవకాశాల్ని దెబ్బతీశాయి. పట్టుదలగా క్రీజ్లో నిలిచిన లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ 127 బ్యాటింగ్) సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో 83) భారీ స్కోరుకు పునాది వేశాడు వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్తో పాటు రహానే (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అండర్సన్కు 2 వికెట్లు దక్కాయి.