టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీపై నయా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కీలక అప్డేట్ ఇచ్చాడు. మహమ్మద్ షమీ ఫిట్గా.. మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని తెలిపాడు. కాకపోతే తుది జట్టులో ఆడించాలా? లేదా? అనేది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయిస్తారని చెప్పాడు.
చీలమండ, మోకాలి గాయంతో మహమ్మద్ షమీ గత 14 నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా బరిలోకి దిగిన అతను ఆ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్తో తాజా సిరీస్తోనే భారత జట్టులోకి వచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికైన షమీకి ఈ సిరీస్ టెస్ట్ లాంటిదని అంతా అనుకున్నారు. కానీ తొలి రెండు టీ20ల్లో షమీకి అవకాశం ఇవ్వలేదు. దాంతో షమీకి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయా? అనే సందేహం వ్యక్తమైంది. కానీ ఎక్స్ట్రా స్పిన్నర్, బ్యాటర్ను ఆడించాలనే ఉద్దేశంతో షమీని పక్కనపెట్టామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
ఈ క్రమంలోనే మంగళవారం జరిగే మూడో టీ20లోనైనా షమీ ఆడుతాడా? లేదా అనే సందేహం వ్యక్తమైంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కొటక్ను ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'అప్కమింగ్ మ్యాచ్ల్లో షమీని ఆడించాలనే ప్రణాళికలు ఉన్నాయి. కానీ అతను ఆడే విషయాన్ని గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ నిర్ణయిస్తారు. షమీ ఫిట్గానే ఉన్నాడు.'అని సితాన్షు కోటక్ తెలిపాడు. రాజ్కోట్ వేదికగా జరిగే మూడో టీ20లో షమీ ఆడే అవకాశాలు ఉన్నాయి. రవి బిష్ణోయ్ స్థానంలో షమీ బరిలోకి దిగనున్నాడు.