ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా.. భారత్-ఏ జట్టుతో ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ను బీసీసీఐ అత్యంత గోప్యంగా నిర్వహిస్తోంది. ఈ మ్యాచ్కు ప్రత్యక్ష ప్రసారం లేదు. స్థానికి మీడియాతో పాటు అభిమానులను కూడా అనుమతించడం లేదు. ఐదు టెస్ట్ల సిరీస్కు సంబంధించిన వ్యూహాలు గోప్యంగా ఉండాలనే ఉద్దేశంతో క్లోజ్డ్ డోర్స్ మధ్య ఈ సిరీస్ను గంభీర్ ప్లాన్ చేశారు. శుక్రవారం బెకన్హామ్లోని కెంట్ కౌంటీ క్రికెట్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు 360 ఓవర్ల పాటు ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు.
ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో ఈ మ్యాచ్కు సంబంధించిన అప్డేట్స్ తెలియడం లేదు. అయితే తొలి రోజు ఆటకు సంబంధించిన కొన్ని విషయాలను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్లు ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో హాఫ్ సెంచరీలు సాధించారని బీసీసీఐ ట్వీట్ చేసింది. శార్దూల్ ఠాకూర్ అత్యధిక వికెట్లు తీసాడని పేర్కొంది. అయితే గిల్, రాహుల్ ఎన్ని పరుగులు చేశారు? శార్దూల్ తీసిన వికెట్లు ఎన్ని అనే వివరాలను మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.

ఇక గంభీర్ మార్క్ కోచింగ్లో భాగంగానే ఈ మ్యాచ్ను గోప్యంగా నిర్వహిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఓ మ్యాచ్ను ఇలానే నిర్వహించారు. ఐదు టెస్ట్ల సిరీస్లో టీమిండియా అనుసరించాల్సిన వ్యూహాలు గోప్యంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్-ఏ, భారత జట్టులోని ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఈ మ్యాచ్ ఆడినట్లు తెలుస్తోంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్.. భారత్-ఏ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించినట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అయితే లేదు.