ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్కు జస్ప్రీత్ బుమ్రా దూరమైనా.. టీమిండియాకు వచ్చే ఇబ్బంది ఏది లేదని స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ తెలిపాడు. బుమ్రా దూరమైనా మహమ్మద్ సిరాజ్ ఉన్నాడని, గత మ్యాచ్లో అతను నాలుగు వికెట్లతో సత్తా చాటాడని గుర్తు చేశాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ శుక్రవారం నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బుమ్రా గైర్హాజరీలో యువ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్లో 19 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచిన బుమ్రా గైర్హాజరీ ప్రత్యర్థి ఇంగ్లండ్కు కలిసి వస్తుందనే ఆందోళన భారత అభిమానుల్లో నెలకొంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన శుభ్మన్ గిల్.. బుమ్రా లేకున్నా టీమిండియాకు వచ్చే సమస్యే లేదన్నాడు. అతని గైర్హాజరీలో టీమిండియా పేస్ అటాక్ను మహమ్మద్ సిరాజ్ నడిపించగలడని చెప్పుకొచ్చాడు.
'ఈ సిరీస్లో మా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్లో ఇరు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమే ఇది. మా పేసర్లు చెలరేగడంతోనే మేం ఆధిక్యంలో నిలిచాం. మా పేస్ విభాగానికి బుమ్రా నాయకుడు. అతని గైర్హాజరీలో పేస్ అటాక్ను నడిపించే సత్తా సిరాజ్కు ఉంది. అతనిలానే సిరాజ్ కూడా బౌలింగ్ చేయగలడు.
ముఖ్యంగా రాజ్కోట్ టెస్ట్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత పిచ్లపై సిరాజ్కు అపారమైన అనుభవం ఉంది.'అని గిల్ చెప్పుకొచ్చాడు.
ఇక విరాట్ కోహ్లీ గైర్హాజరీపై స్పందించిన గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ లేకపోవడం ఏ జట్టుకైనా ఇబ్బందేనని, అయితే అతని గైర్హాజరీ కుర్రాళ్లకు మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు.
భారత్-ఏతో పాటు రంజీల్లో మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేసానని శుభ్మన్ గిల్ గుర్తు చేశాడు. ఫస్ట్ డౌన్లో ఆడటం తనకు కొత్త కాదన్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగితే కాస్త దూకుడుగా ఆడాల్సి ఉంటుందని, మిడిలార్డర్లో మాత్రం పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని చెప్పాడు.