రోహిత్ శర్మ తరహాలోనే ఆటగాళ్ల కెప్టెన్గా ఉంటానని టీమిండియా నయా సారథి శుభ్మన్ గిల్ తెలిపాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ సవాల్తో కూడుకున్నదని, ఈ ఛాలెంజ్ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. కెప్టెన్గా ప్రత్యేకమైన శైలిని అనుసరించనని స్పష్టం చేశాడు. ఆటగాళ్లతో మాట్లాడుతూ.. వాళ్లలో భద్రతభావాన్ని కలిగిస్తానన్నాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి శుభ్మన్ గిల్ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనను ఉద్దేశించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా అన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోతే అతని స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు జట్టులో ఉన్నారని గిల్ తెలిపాడు. 'భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. మా పేస్ విభాగం బలంగా ఉంది. మా పేసర్లు ఎలాంటి స్థితిలోనైనా రాణించి జట్టును గెలిపించగలరు. కెప్టెన్గా నేను ప్రత్యేకమైన శైలిని అనుసరించను. రోహిత్ శర్మ తరహాలోనే ఆటగాళ్లకు అండగా ఉంటూ వారితో సత్సంబంధాలు పెంచుకుంటా. వారితో మాట్లాడుతూ భద్రతాభావాన్ని కలిగిస్తా. వాళ్లతో వాళ్ల బలాలు, బలహీనతల గురించి చర్చిస్తా.

ఓ సారథిగా ఇది చాలా ముఖ్యం. భద్రతా భావం కలిగినప్పుడే ఆటగాళ్లు నూరు శాతం కష్టపడతారు. ఇంగ్లండ్ పర్యటనలో బ్యాటర్గా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ కాలం భారత జట్టుకు ఆడి ఎన్నో విజయాలు అందించారు. వారి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టం. కానీ మా జట్టు కుర్రాళ్లు, సీనియర్లతో కలిసి ఉంది.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా ఇంగ్లండ్ పర్యటన.. జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఐదు టెస్ట్ల సిరీస్ మొదలవ్వనుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్కు తెరలేవనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించనుంది. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.