టీమిండియా బ్యాటింగ్ ఆల్రౌండర్ శివమ్ దూబే చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్ దిగ్గజాలు కోహ్లీ, ధోనీ, రోహిత్, సూర్యకుమార్ యాదవ్లకు సాధ్యం కానీ వరల్డ్ రికార్డ్ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్తో ముంబై వేదికగా జరిగిన ఐదు టీ20 ద్వారా శివమ్ దూబే ఈ ఫీట్ సాధించాడు.
వాస్తవానికి ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో శివమ్ దూబేకు అవకాశం దక్కలేదు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ గాయపడటంతో వారి స్థానాల్లో బీసీసీఐ శివమ్ దూబే, రమణ్దీప్ సింగ్లను ఎంపిక చేసింది. రింకూ సింగ్ రీఎంట్రీ ఇచ్చినా.. నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రెండో టీ20కే శివమ్ దూబే అందుబాటులోకి వచ్చినా.. అతనికి అవకాశం ఇవ్వలేదు.

నాలుగో టీ20లో తుది జట్టులోకి వచ్చిన శివమ్ దూబే సంచలన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కంకషన్ గాయం కారణంగా బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. అయినా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆఖరి టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగగా.. శివమ్ దూబే 13 బంతుల్లో 30 పరుగులతో సత్తా చాటాడు. అనంతరం బౌలింగ్లో 2 కీలక వికెట్లు తీసాడు. ఈ ప్రదర్శనతో కంకషన్ సబ్స్టిట్యూషన్పై వచ్చిన విమర్శలకు తనదైన శైలిలో బదులిచ్చాడు.
శివమ్ దూబే సూపర్ పెర్ఫామెన్స్తో నాలుగో టీ20లో 15 పరుగులతో గెలిచిన టీమిండియా.. ఆఖరి మ్యాచ్లో 150 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో శివమ్ దూబే తన పేరిట ఓ యూనిక్ రికార్డ్ను లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 30 మ్యాచ్లు గెలిచిన తొలి ప్లేయర్గా చరిత్రకెక్కాడు.
2019లో బంగ్లాదేశ్తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్ర చేసిన శివమ్ దూబే ఇప్పటి వరకు 35 టీ20లు ఆడాడు. దూబే అరంగేట్ర మ్యాచ్లో టీమిండియా 7 వికెట్లతో ఓడగా..అతని ఐదో టీ20లోనూ టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత దూబే ఆడిన 30 మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచింది.
ఈ రికార్డ్ను తెలియజేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ శివమ్ దూబేను ఎక్స్ వేదికగా అభినందించింది. 'దూబే ఆడితే భారత్కు విజయమే. 30-0 కొనసాగుతూనే ఉంది. 11/12/2019 టీ20ల్లో దూబే విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది'అని క్యాప్షన్గా పేర్కొంది.
If Dube plays, India wins
— Chennai Super Kings (@ChennaiIPL) February 3, 2025
30-0 and still going strong 🥳💪🏻💥#WhistlePodu #INDvENG
📸 : BCCI pic.twitter.com/qMCCBxC0rb