ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నగరం అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్ల సిరీస్లో తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. జనవరి 25 నుంచి 29 వరకు జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిద్దం చేసింది.
స్టేడియాన్ని రినోవేషన్ చేసిన హెచ్సీఏ కలర్ ఫుల్ సీటింగ్తో ముస్తాబు చేసింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. హెచ్సీఏ ప్యానెల్తో కలిసి మాట్లాడిన ఆయన.. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

'మేం ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ మ్యాచ్ జరిగి ఐదు రోజుల పాటు రోజుకు ఐదు వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నాం. మ్యాచ్కు రావాలనుకుంటున్న స్కూల్ విద్యార్థులు.. సంబంధిత స్కూల్ లెటర్ను హెచ్సీఏకు పంపిస్తే టికెట్లను నేరుగా వారి వద్దకే పంపిస్తాం.
ఒక్క స్కూల్కు ఒక రోజు మాత్రమే అనుమతి ఉంటుంది. విద్యార్థులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా ఆ రోజు ఆర్మీ జవాన్లకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని మా ప్యానెల్ నిర్ణయించింది. ఆసక్తి గల జవాన్లు తమ హెచ్ఓడీలతో సంతకం చేసిన లేఖలను, కుటుంబ సభ్యుల వివరాలను అందిస్తే టికెట్లు ఇస్తామని తెలిపారు.
ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు పేటీఎం ఇన్సైడర్ యాప్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 26 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఆదివారం నుంచి 24వ తేదీ వరకు జింఖాన మైదానంలో ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి.'అని జగన్మోహన్ రావు సూచించారు.
అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ అనంతరం భారత్ ఆటగాళ్లకు బీసీసీఐ రెండు రోజుల విశ్రాంతి ఇచ్చింది. సోమవారం వరకు టెస్ట్ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లంతా హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ రోజు నుంచే భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం కానుంది.