రవీంద్ర జడేజా సహకారంతోనే తాను హాఫ్ సెంచరీ చేయగలిగానని టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. ఇంగ్లండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్ర చేసిన సర్ఫరాజ్ ఖాన్.. తొలి మ్యాచ్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన అతను 48 బంతుల్లోనే అర్థశతకాన్ని అందుకొని టెస్ట్ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన హార్దిక్ పాండ్యా సరసన నిలిచాడు.
స్వేచ్చగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన అతని ఇన్నింగ్స్కు రవీంద్ర జడేజా తప్పిదం కారణంగా బ్రేక్ పడింది. 99 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద జడేజా చేసిన తప్పిదంతో సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 62)రనౌట్గా వెనుదిరిగాడు. దాంతో అందరూ నిరాశకు గురయ్యారు. చివరకు జడేజా సైతం తన శతకాన్ని సెలెబ్రేట్ చేసుకోలేదు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సర్ఫరాజ్ ఖాన్... జడేజా కారణంగానే తాను స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలిగానని తెలిపాడు. రనౌట్ సంఘటన క్రికెట్ సహజమని పేర్కొన్నాడు.

'నా తండ్రి సమక్షంలో టీమిండియా అరంగేట్రం క్యాప్ అందుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. అతని ముందు భారత జట్టు ఆడటం నా కల. అది ఈ రోజు నెరవేరింది. ఈ మ్యాచ్లో నేను సుమారు 4 గంటల పాటు ప్యాడ్లు కట్టుకొని కూర్చున్నాను. ఒపికగా ఉండాలని తరుచూ నా అంతరాత్మకు చెప్పుకున్నాను. క్రీజులోకి వెళ్లగానే.. తరుచూ నాతో మాట్లాడమని జడ్డూ భాయ్కు చెప్పాను. బ్యాటింగ్ చేసేటప్పుడు మాట్లాడటం నాకిష్టం. అతను చాలా అండగా నిలిచాడు. మాట్లాడుతూ నన్ను ప్రోత్సహించాడు. క్రీజులోకి అడుగుపెట్టినప్పుడు కాస్త కంగారుపడ్డాను. కానీ ఆ తర్వాత మాములుగా ఆడాను.
వాస్తవానికి ఈ మ్యాచ్కు రావాలని మా నాన్నకు లేదు. కొందరు రిక్వెస్ట్ చేయడంతో వచ్చాడు. నా జీవితంలోని స్పెషల్ మూమెంట్ను దగ్గరుండి చూశాడు. నేను టీమిండియాకు ఆడాలని మా నాన్న పడ్డ కష్టం వృథా అవ్వలేదు. దాంతో నా భుజాలపై ఉన్న బరువు కాస్త తగ్గిందని ఫీలవుతున్నా. ఈ మ్యాచ్లో లూజ్ బాల్స్ను బిందాస్గా బౌండరీకి తరలించాను.'అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.