టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి నోరు జారాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావించకుండా అతన్ని కించపర్చాడు. దాంతో మంజ్రేకర్పై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్కు సంజయ్ మంజ్రేకర్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా బౌలింగ్కు అనుకూలంగా ఉండే ఫస్ట్ సెషన్లో ఓపికగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు సంధించిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలను తెలివిగా వదిలేసారు. ఈ సందర్భంగా కామెంట్రీ ప్యానెల్లో ఉన్న సంజయ్ మంజ్రేకర్.. రాహుల్-జైస్వాల్ను అభినందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

రాహుల్, జైస్వాల్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేయడాన్ని సంజయ్ మంజ్రేకర్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఈ క్రమంలోనే కోహ్లీని కించపర్చేలా వ్యాఖ్యలు చేశాడు. 'ఒక మాజీ బ్యాటర్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడటం అలవాటు. వాటిని ఆడి అతను తరుచూ ఇబ్బందుల్లో పడేవాడు. కానీ ఈ ఇద్దరు (జైస్వాల్, రాహుల్) ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ను తెలివిగా వదిలేస్తున్నారు.' అని మంజ్రేకర్ తన వ్యాఖ్యానంలో చెప్పుకొచ్చారు.
సంజయ్ మంజ్రేకర్ ఎవరి పేరు ప్రస్తావించకపోయినా.. కోహ్లీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ మాత్రమే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కు ఎక్కువగా ఇబ్బంది పడ్డాడు. 2014 ఇంగ్లండ్ పర్యటనతో పాటు ఆసీస్ గడ్డపై కూడా కోహ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడబోయే మూల్యం చెల్లించుకున్నాడు.
ఈ క్రమంలోనే సంజయ్ మంజ్రేకర్ పేరు ప్రస్తావించకపోయినా.. కోహ్లీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సంజయ్ మంజ్రేకర్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంజ్రేకర్ నోటి దూల ఇంకా తీరలేదని మండిపడుతున్నారు.
సంజయ్ మంజ్రేకర్ గతంలో కూడా రవీంద్ర జడేజాతో పాటు ఇతర ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అతని వివాదాస్పద శైలి నేపథ్యంలో కామెంట్రీ ప్యానెల్ నుంచి బీసీసీఐ కొన్నాళ్ల పాటు మంజ్రేకర్ను దూరంగా కూడా ఉంచింది. అయినా అతని తీరును మార్చుకోలేదు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 359 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 101), శుభ్మన్ గిల్(127 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగగా.. రిషభ్ పంత్(65 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్(42)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా టాప్-5 బ్యాటర్లలో సాయి సుదర్శన్(0) ఒక్కడే విఫలమవ్వగా.. మిగతా బ్యాటర్లంతా రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ తీసాడు.