ఇంగ్లండ్తో చివరి టెస్ట్లో భారత్ విజయం సాధించాలంటే తుది జట్టులో రెండు మార్పులు చేయాలని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సూచించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభమయ్యే ఆఖరి టెస్ట్లో విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది.
ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో తమ అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి గెలుపుతో భారత పర్యటనను ముగించాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. తొడ కండరాల నొప్పితో ఈ సిరీస్ మధ్యలోనే తప్పుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆఖరి టెస్ట్కు కూడా దూరమయ్యాడు.

వర్క్లోడ్మేనేజ్మెంట్లో భాగంగా నాలుగో టెస్ట్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో అతను తుది జట్టులోకి రానున్నాడు. అయితే ధర్మశాల పిచ్ కండిషన్స్ నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉందని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన అతను పిచ్ కండిషన్స్ నేపథ్యంలో టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగాలని చెప్పాడు. 'భారత్ వర్సెస్ ఇంగ్లండ్ చివరి టెస్ట్ ధర్మశాలలో జరగనుంది. ఎత్తులో ఉన్న ప్రదేశం కావడంతో అక్కడ వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. కాబట్టి బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి మైదానం సహజ స్వభావం కూడా అదే. కండిషన్స్కు తగ్గట్లు టీమిండియాలో మార్పు ఉంటుంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నాడు.
టీమిండియా ముగ్గురు పేసర్లు సిరాజ్, బుమ్రా, ఆకాశ్దీప్లతో కలిసి ఆడుతోంది. అలాగే గత మూడు టెస్ట్ల్లో విఫలమైన రజత్ పటీదార్ స్థానంలో మరో యువ ప్లేయర్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. దేవదత్ పడిక్కల్కు టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వనుంది. చివరి టెస్ట్కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది.
భారత్లో టెస్ట్ క్రికెట్ అనగానే విదేశీ ఆటగాళ్లు పిచ్ల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువగా పిచ్ల గురించే చర్చిస్తుంటారు. పిచ్లు కాస్త స్పిన్కు అనుకూలంగా ఉంటే స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీస్తారని అనుకుంటారు.
కానీ ఈ సిరీస్లో భారత పేసర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. రెండో టెస్ట్లో బుమ్రా.. నాలుగో టెస్ట్లో ఆకాశ్దీప్ వేసిన స్పెల్స్ అద్భుతం. ఈ రెండు మ్యాచ్ల్లో భారత్ గెలవడానికి మఖ్య కారణం ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనే.'అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.